బేగంపేట్ జనవరి 24: ఛాతి మధ్యలో పెరిగిన పెద్ద కణితిని విజయవంతంగా సర్జరీ చేసి తొలగించారు సికింద్రాబాద్ కిమ్స్ వైద్యులు. కిమ్స్ దవాఖాన వైద్యులు సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ డి.రాము, అజయ్ చాణక్య చికిత్స విధానాన్ని సోమవారం దవాఖాన ప్రాంగణంలో వివరించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన చక్రవర్తి (35) వృత్తిరీత్యా ప్రైవేట్ ఉద్యోగి. ఇతనికి కొంత కాలంగా శ్వాస సరిగ్గా రాలేదు. అక్కడి వైద్యులను సంప్రదించగా టీబీ అని చెప్పగా కొద్దిరోజులు మందులు వాడినా ఫలితం లేదు. ఇటీవల చక్రవర్తి సికింద్రాబాద్లోని కిమ్స్ దవాఖాన డాక్టర్లను సంప్రదించగా వారు సీటీ స్కాన్ చేశారు. ఛాతి మధ్యలో కుడి ఊపిరితిత్తి వైపు దాదాపు 25 సెంటీమీటర్లకు పైగా కణితి ఉన్నట్లు గుర్తించారు. దీన్ని టెరటోమ వ్యాధి గా పిలుస్తారు. ఈ కణితి ఛాతి మధ్యలో గుండెకు సమీపంలో శరీరంలోని ప్రధాన రక్తనాళంతో పాటు గుండెని రక్షించే పెరికార్డియోకు కూడా వ్యాప్తి చెందింది. దీంతో అతనికి థొరాకోటమీ ఎన్ బ్లాక్ ఎక్సిఫియన్ ఆఫ్ మీడియా స్టినల్ టెరటోమా అనే ఓపెన్ సర్జరీ చేసినట్లు వైద్యులు తెలిపారు. అంతే కాకుండా కృత్రిమంగా తయారు చేసిన పెరికార్డియో అమర్చి 25 సెంటీమీటర్లకు పైగా పెరిగిన కణితిని విజయవంతంగా తొలగించినట్టు వైద్యులు వెల్లడించారు.