రంగారెడ్డి, జనవరి 24, (నమస్తే తెలంగాణ): పేద దళిత కుటుంబాల్లో ఆర్థిక సాధికారతను సాధించేందుకుగాను టీఆర్ఎస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన ‘దళితబంధు’ పథకాన్ని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేసేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గంలో కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దళితుబంధును క్షేత్రస్థాయిలో ఏ విధంగా అమలుచేయనున్నారు, లబ్ధ్దిదారుల ఎంపిక ఎలా జరుగనున్నది, ఎప్పటిలోగా పూర్తికానుంది, ఎంపికలో ఎమ్మెల్యేల పాత్ర ఏమిటీ, జిల్లాలో దళితుబంధు అమలుకు ఎన్ని నిధులు అవసరం, లబ్ధిదారులు కోరుకున్న యూనిట్నే మంజూరు చేస్తారా వంటి అంశాల్లో భాగంగా దళిత బంధు పథకంపై పూర్తి స్పష్టతనిచ్చేందుకుగాను జిల్లా కలెక్టర్ డి.అమయ్కుమార్తో నమస్తే తెలంగాణ ప్రతినిధి ప్రత్యేక ఇంటర్వ్యూ…
దళితబంధు అమలు ప్రక్రియ షురూ…
ప్రభుత్వ ఆదేశాల మేరకు దళితబంధు కార్యక్రమం అమలు ప్రక్రియను జిల్లాలో ప్రారంభించాం. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతున్నది. ప్రభుత్వం ఫిబ్రవరి 5 వరకు ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది.
క్షేత్రస్థాయిలో అమలు ఇలా…
దళితబంధు పథకాన్ని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలుచేసేందుకు చర్యలు చేపట్టాం. దళితబంధు అమల్లో భాగంగా మొదట లబ్ధిదారుల ఎంపిక, అనంతరం ప్రతి మండలంలో అనువైన బ్యాంకును ఎంపిక చేసి కుటుంబ పెద్ద పేరిట ప్రత్యేకంగా దళిత బంధు బ్యాంకు ఖాతాను తెరిపించనున్నారు. లబ్ధిదారులకు మంజూరు చేసే రూ.10 లక్షల యూనిట్లో రూ.10 వేలను దళిత రక్షణ నిధిలో జమచేస్తాం. ఎంపిక ప్రక్రియ అనంతరం లబ్ధ్దిదారులతో గ్రామ, మండల కమిటీలను ఏర్పాటు చేసి, ఆయా కమిటీలతో సమావేశమై ఏ వ్యాపారంపై నైపుణ్యం ఉందనే వివరాలను సేకరించి యూనిట్లను గ్రౌండింగ్ చేస్తాం. అంతేకాకుండా లబ్ధిదారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తాం.
లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేల పాత్ర…
దళితబంధు పథకంలో భాగంగా నియోజకవర్గానికి 100మంది లబ్ధిదారులను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రయ జరుగనుంది. ఎమ్మెల్యే, ఆయా జిల్లాల ఇన్చార్జి మంత్రి ఆమోదం అనంతరం లబ్ధిదారుల జాబితాను గ్రౌండింగ్ కోసం కలెక్టర్కు అందజేస్తారు. లబ్ధిదారుల ఎంపికలో 60-65 ఏండ్లలోపు వారిని పరిగణనలోకి తీసుకోనున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున యూనిట్లను గ్రౌండింగ్ చేయనున్నారు.
త్వరలో సమన్వయ సమావేశం..
లబ్ధిదారుల ఎంపిక అనంతరం గ్రౌండింగ్ మంజూరు చేసే సమయంలో కో-ఆర్డినేషన్ సమావేశాన్ని వ్యవసాయాధికారి, రవాణాశాఖ అధికారి, పశుసంవర్ధక శాఖ తదితర అధికారులతో సమావేశాలను నిర్వహిస్తాం.
యూనిట్ల వివరాలు
రూ.10 లక్షల్లో మంజూరు చేసే యూనిట్లకు సంబంధించి మినీ డైరీ, ట్రాక్టర్-ట్రాలీ, కోడి పిల్లల పెంపకం, వరి నాటు యంత్రం, పందిరి సాగు, ఏడుగురు కూర్చునే సమర్థ్యంగల ఆటో, ఆటో రిక్షా, సరుకు రవాణా ఆటో, ఐరన్ గేట్స్-గ్రిల్స్ తయారీ యూనిట్-ఆటో, కాంక్రీట్ మిశ్రమం తయారీ యంత్రం, సెంట్రింగ్, మట్టి ఇటుకల తయారీ-ఆటో ట్రాలీ, ఆయిల్ మిల్, బియ్యం, పసుపు గిర్ని, మెడికల్ మరియు జనరల్ స్టోర్స్, మినీ సూపర్ బజార్, ఎలక్ట్రానిక్ పరికరాల అమ్మకం-సేవలు, ఎలక్ట్రికల్ షాప్-మోటార్ వైన్డింగ్-బ్యాటరీ సేవలు, హార్డ్వేర్-శానిటరీ దుకాణం, విత్తనాలు-ఎరువుల-క్రిమిసంహారక మందుల దుకాణం, వ్యవసాయ సాగుకోసం యంత్ర పరికరాల అమ్మకం, హోటల్-క్యాటరింగ్-ఆటోట్రాలీ, డీటీపీ-మీసేవా-సీఎస్సీ ఆన్లైన్ సెంటర్-ఫొటో స్టూడియో, డయాగ్నోస్టిక్ ల్యాబ్-మెడికల్ షాప్, టెంట్హౌస్-డెకరేషన్-లైటింగ్-సౌండ్ సిస్టం-ఆటోట్రాలీ వంటి యూనిట్లతోపాటు లబ్ధిదారులు కోరుకునే ఇతర యూనిట్లను మంజూరు చేయనున్నారు.
జిల్లాలో దళిత కుటుంబాల సంఖ్య
జిల్లాలో మొత్తం దళిత కుటుంబాలు 1,18,514
చేవెళ్ల నియోజకవర్గంలో 17,019 l ఇబ్రహీంపట్నంలో 22060
ఎల్బీనగర్లో 15,656 l మహేశ్వరం నియోజకవర్గంలో 12,820
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 11,442
షాద్నగర్ నియోజకవర్గంలో 13,114
కల్వకుర్తి నియోజకవర్గంలో 8583కుటుంబాలు
జిల్లాకు అవసరమయ్యే నిధులు
దళితబంధు కోసం జిల్లాకు రూ.65-70కోట్ల నిధులు
జిల్లాలో ఎస్సీ జనాభా 4,47,888
జిల్లా మొత్తం జనాభాలో ఎస్సీల శాతం 15.40 శాతం
జిల్లాలోని నియోజకవర్గాలు
జిల్లాలో చేవెళ్ల, షాద్నగర్, మహేశ్వరం, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, కల్వకుర్తి నియోజకవర్గాలున్నాయి ఒక్కో నియోజకవర్గం నుంచి 100 మంది లబ్ధిదారులకు గాను నియోజకవర్గానికి రూ.10 కోట్లను ప్రభుత్వం మంజూరు చేయనున్నది. అయితే కల్వకుర్తి నియోజకవర్గం నాలుగు మండలాలు రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి, మిగతా రెండు మండలాలు నాగర్కర్నూల్ జిల్లాలో ఉన్నాయి కాబట్టి స్థానిక ఎమ్మెల్యే నిర్ణయం మేరకు నిధులు విడుదల కానున్నాయి.