సిటీబ్యూరో, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియానికి శ్రీకారం చుడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ‘మన ఊరు-మనబడి’ పథకం తెరపైకి తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్ లుక్ రాబోతుంది. ఇన్నాళ్లూ నిరాదరణకు గురైన పాఠశాలలకు సకల వసతులు కల్పిస్తుండడంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు కూడా భారీగా పెరుగనున్నాయి. అన్ని సర్కారీ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం బోధన అందుబాటులోకి తేవడం చారిత్రాత్మక నిర్ణయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం హైదరాబాద్ జిల్లాలో ఇప్పటికే 90శాతం వరకు స్కూళ్లు ఇంగ్లిష్ మీడియంలో నడుస్తున్నాయి. వాటిలో మంచి ఫలితాలు వస్తున్నాయి. దశాబ్దానికిపైగా అందుబాటులోకి వచ్చిన ఇంగ్లిష్ చదువులు జిల్లాలకు చెందిన ఎందరో విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపింది. తెలుగు బోధనను ఏ మాత్రం విస్మరించకుండా అన్ని స్కూళ్లలో సమాంతరంగా తెలుగుమీడియం తరగతులు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ జిల్లాలో ఇంగ్లిష్ మీడియం తరగతులకే విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. ఇంగ్లిష్ మీడియం బోధన వల్ల గల్లీల్లో ఉండే ప్రైవేటు స్కూళ్ల కంటే సర్కారి స్కూళ్లకే ఎక్కువ ఆదరణ కనబడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వ్యాప్తి సమయంలో జిల్లాలో ఇంగ్లిష్ మీడియం స్కూళ్లకు మరింత ఆదరణ పెరిగింది. ప్రైవేటు విద్యార్థులంతా జిల్లాలోని ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లకు వలస వచ్చారు. ఈ విద్యా సంవత్సరంలో దాదాపు ఐదు వేలకు పైగా విద్యార్థులు ఇంగ్లిష్ మీడియం క్లాసులలో అదనంగా అడ్మిషన్లు పొందినట్లు జిల్లా విద్యాధికారులు చెబుతున్నారు.
ఇంగ్లిష్ మీడియంలోనే అడ్మిషన్లు..
ఇంగ్లిష్ మీడియం క్లాసులలోనే 70 శాతం విద్యార్థులు ప్రతి ఏటా ప్రవేశాలు పొందుతున్నారు. ఉదాహరణకు మలక్పేట్ హైస్కూల్, నల్లకుంట, కాచిగూడ, రాజ్భవన్, మహబూబియా, ఆలియా, అంబర్పేట్ వంటి అనేక స్కూళ్లు ఇంగ్లీష్ మీడియంలో కొనసాగుతుందన్నవల్లే ఆయా స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య బాగా ఉంది. ఆయా స్కూళ్లలో దాదాపు 700 నుంచి 800 వరకు ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్న విద్యార్థులు ఉన్నట్లు అధికారులు ధ్రువీకరిస్తున్నారు. పైగా ప్రభుత్వం ఇప్పుడు మన ఊరు మన బడి కార్యక్రమంలో ఇప్పటికే ఆలియా, మహబూబియా పాఠశాలలకు దాదాపు రూ.60 లక్షల కేటాయించారు. శరవేగంగా పనులు చేస్తూ ఆయా స్కూళ్లకు నయా లుక్ తీసుకువస్తున్నారు.
‘మన ఊరు-మన బడి’ ప్రయోజనాలు..
‘మన ఊరు-మనబడి’ అందరికీ అందుబాటులో ఇంగ్లిష్ మీడియం చదువులు
ప్రతి స్కూల్ అభివృద్ధికి కనీసం రూ. 50 లక్షల వరకు నిధులు కేటాయింపు
ఇంగ్లిష్ మీడియం బోధనతో ఆకర్షితులు కానున్న విద్యార్థులు, తల్లిదండ్రులు
సర్కార్ బడుల అభివృద్ధికి రూ. 16 కోట్లు
మేడ్చల్, జనవరి24 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 505 సర్కార్ బడులు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 375, ప్రాథమికోన్నత పాఠశాలలు 22, ఉన్నత పాఠశాలలు 108 ఉండగా ప్రస్తుతం ఉన్నత పాఠశాలలో 6 వతరగతి నుంచి 10 వతరగతి వరకు తెలుగు మీడియంతో పాటు ఇంగ్లిష్ మీడియంను కొనసాగిస్తున్నారు. ఇంగ్లిష్ మీడియంలో 27,495 మంది విద్యార్థులు చదువుతున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ బడులలో ఇంగ్లిష్ మీడియం అమలు కానున్నది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో లక్ష 2 వేల 202 మంది విద్యార్థులు చదువు కుంటున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రైవేట్ పాఠశాలల నుంచి 14వేల 203 మంది విద్యార్థులు సర్కారు బడులలో చేరారు. సర్కార్ బడులను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం మన ఊరు..మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని సర్కార్ బడిల అభివృద్ధికి రూ. 16 కోట్ల నిధులను ఖర్చు చేయనున్నారు. అభివృద్ధి చేసే సర్కార్ బడులను ఇటీవలే అధికారులు గుర్తించారు.
ఇంగ్లిష్ మీడియానికి ఆదరణ
హైదరాబాద్ జిల్లాలలో దాదాపు 180 స్కూళ్లు వరకు ఉన్నాయి. వాటిలో దాదాపు 90 శాతం వరకు తెలుగు మీడియంతో పాటు సమాంతరంగా ఇంగ్లిష్ మీడియం క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా విద్యార్థులలో 70 శాతం ఇంగ్లిష్ మీడియంలోనే ప్రవేశాలు పొందుతున్నారు. ఇతర జిల్లాల నుంచి తాత్కాలిక పనులు మీద వస్తున్న వారు మాత్రమే తెలుగు మీడియం క్లాసులకు హాజరవుతున్నారు. వారు 30 శాతం వరకు మాత్రమే ఉంటారు.మన ఊరు-మన బడి పథకం నేపథ్యంలో ప్రైవేటు స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవచ్చు.
భవిష్యత్కు భరోసా
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము సంపూర్ణంగా స్వాగతిస్తున్నాం. ఇంగ్లీష్ మీడియం చదువులు భవిష్యత్కు భరోసాగా నిలుస్తాయి. విద్యార్థులలో సంపూర్ణ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంగ్లిష్ మీడియం బోధన వల్ల ముఖ్యంగా డ్రాప్అవుట్స్ గణనీయంగా తగ్గుతుంది. ఉన్నత చదువులకు ఆవకాశం ఉంటుంది. మంచి ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశం ఏర్పడుతుంది.
మంచి ర్యాంకులు వస్తాయి
హైదరాబాద్ వంటి జిల్లాలో ఇంగ్లిష్ మీడియం చదువులకు మంచి ఆదరణ ఉంటుంది. ఎంసెట్, నీట్, జేఈఈ వంటి ప్రవేశ పరీక్షలలో మంచి ర్యాంకులు సాధించడానికి ఇంగ్లిష్ మీడియం ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అందుకే ఈ జిల్లాలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం స్కూళ్లకు ఎక్కువ మంది విద్యార్థినీ, విద్యార్థులు వస్తారు.
విద్యార్థులకు మంచి భవిష్యత్
ఒకటవ తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం చదివినట్లయితే విద్యార్థులకు అన్ని రంగాలలో మంచి భవిష్యత్ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలలో ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు లేకపోవడంతో కొంత నష్టం జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టేందుకు తీసుకున్న నిర్ణయం భవిష్యత్లో నిరుపేద విద్యార్థులకు సౌకర్యవంతంగా మారనుంది.
ప్రభుత్వ నిర్ణయం హర్షనీయం
ప్రభుత్వ పాఠశాలలో 1వతరగతి నుంచి 10వతరగతి వరకు ఇంగ్లిష్ మీడియం వల్ల పేద, మధ్య తరగతి పిల్లలకు వరంగా మారుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంగ్లిష్ మీడియం అందుబాటులో లేకపోవడంతో పిల్లలు తప్పనిసరి పరిస్థితులలో తెలుగు మీడియంలో చదువుకుంటున్నారు. ప్రాథమిక విద్య నుంచి ఇంగ్లిష్ మీడియంలో చదివిన పిల్లలకు మంచి భవిష్యత్ ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలను అన్ని ప్రమాణాలతో తీర్చిదిద్దే ప్రభుత్వ నిర్ణయం హర్షనీయం.
ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెరుగుతాయి
ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇంగ్లిష్ మీడియంలో పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలకు పంపించారు. ఆ ఫీజులు చెల్లించలేక అప్పులపాలయిన కుటుంబాలూ ఉన్నాయి. ప్రస్తుతం సర్కారు నిర్ణయంతో ఆ ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వస్తారు ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు పెరుగుతాయి.
నిరుపేదల కలలు నిజం అవుతాయి
గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలను ఇంగ్లిష్ మీడియం చదివించేందుకు తల్లిదండ్రుల ఆర్థిక స్థోమత సరిపోవడం లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వ బడులలో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టడం అభినందనీయం. సర్కారు నిర్ణయంతో ఇంగ్లిష్ మీడియం చదువాలనే నిరుపేదల పిల్లల కలలు నిజం కానున్నాయి. నిరుపేద విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారు.