శామీర్పేట, జనవరి 24 : ఎర్రకుంటలో చేపల వలలో మహిళ మృతదేహం లభ్యమైన కేసును శామీర్పేట పోలీసులు ఛేదించారు. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త స్నేహితుడితో కలిసి హతమార్చాడు. నిందితులను అరెస్టు చేసి సోమవారం రిమాండ్కు తరలించారు. సీఐ సుధీర్కుమార్ తెలిపిన కథనం ప్రకారం వివరాలు.. యాదాద్రి జిల్లా మాదాపూర్కు చెందిన ఆరే పోచయ్య పొన్నాల్ ఎర్రకుంట చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి వలను పైకి తీస్తుండగా ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం బట్టలు లేకుండా వలలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. శామీర్పేట పోలీసులు, బాలానగర్ ఎస్వోటీ పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకుని విచారణ చేపట్టగా నేరాన్ని ఒప్పుకున్నారు. దీంతో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు.
మహారాష్ట్ర గోదియా జిల్లా రావన్వాడి తాండకు చెందిన యోగేశ్ సంతోశ్ దేశ్ముఖ్, సీమా వైష్ణవి 2020లో ఫోన్ ద్వారా పరిచయం అయ్యారు. ఆమెతో దేశ్ముఖ్ శారీరక సంబంధం పెట్టుకున్నాడు. పెండ్లి చేసుకోవాలని వైష్ణవి కోరగా నిరాకరించడంతో రేప్కేస్ పెట్టింది. చేసేదిలేక దేశ్ముఖ్ రాజీపడి వివాహం చేసుకున్నాడు. అయితే వైష్ణవి ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకున్నదని, తాను ఇంట్లోలేని సమయంలో వారితో కలుస్తున్నది అనుమానం పెంచుకున్నాడు. భార్యాభర్తలు మాట్లాడుకుని.. ప్రస్తుతం ఉంటున్న ఏరియాను మార్చాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం మంచిర్యాలలో పనిచేసున్న తన స్నేహితుడు రాజేశ్డాంగేకు ఫోన్ చేసి అక్కడికి వెళ్లారు. అక్కడ పనిదొరకక పోవడంతో శామీర్పేట మండలంలోని పొన్నాల్ గ్రామానికి చేరుకున్నారు.
భార్యపై అనుమానం పెంచుకుని..
ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్న దేశ్ముఖ్ ఎలాగైనా హతమార్చాలని స్నేహితుడు రాజేశ్డాంగేతో కలిసి పథకం వేశాడు. ఎల్బీనగర్కు పనికోసం వెళ్లారు. అక్కడ పనిదొరకలేదు. తిరిగి నగరం నుంచి శామీర్పేటకు బస్సులో వచ్చారు. అక్కడి నుంచి పొన్నాల్కు ఆటోలో చేరుకున్నారు. సీమాను బస్టాండ్లో కూర్చోబెట్టి హత్యచేసేందుకు అనువైన స్థలంకోసం వెతికి వచ్చారు. సాయంత్రం అయిన తర్వాత దగ్గరలోనే ఉన్న బంధువుల వద్దకు వెళ్దామని నడుచుకుంటూ వెళ్లారు. పొన్నాల్లోని ఎర్రకుంట వద్దకు రాగానే భర్త దేశ్ముఖ్ కడుపునొప్పి వచ్చినట్లు నటించాడు. అదే సమయంలో స్నేహితుడి సహాయంతో భార్య వైష్ణవి మెడకు చున్నీ బిగించి హతమార్చారు. ఎవరూ గుర్తుపట్టకుండా ఆమె ఒంటిపై ఉన్న దుస్తులు తొలగించి, మృతదేహం తేలకుండా బండరాయి కట్టి చెరువులో పడేశారు. దుస్తులు, హ్యాండ్ బ్యాగ్ ఇతర వస్తువులను తగులబెట్టినట్లు నిందితులు విచారణలో వెల్లడించారని సీఐ తెలిపారు. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.