సంక్రాంతి పతంగుల మాంజా పక్షుల రెక్కలను దారుణంగా కోసేస్తున్నాయి. పతంగుల ఎగరడం ఆగిపోయినా, ఎగిరేసే సమయంలో కాట్ అయి చెట్ల మీద పడడం, మాంజా ఆ చెట్లకు చుట్టుకుపోవడంతో ఇప్పుడు అది పక్షులకు ప్రాణ సంకటంగా మారింది. ఈ పరిస్థితుల్లో పక్షుల బాధను చూడలేక ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి వాటిని కాపాడేందుకు కృషి చేస్తున్నాడు. పక్షుల రక్షణ కోసం ఓ ఎమెర్జన్సీ నెంబరును పెట్టి స్వచ్ఛందంగా సేవ చేస్తూ నెల రోజుల వ్యవధిలో దాదాపు 130 పావురాలు, గద్దలు, ఇతర పక్షులను కాపాడాడు. పక్షుల మీద ఉన్న ప్రేమతో ఏకంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి ఫ్రీలాన్స్గా పని చేస్తూ పూర్తి సమయాన్ని వాటి రక్షణ కోసం కేటాయిస్తుండటం విశేషం.
సిటీబ్యూరో, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ప్రదీప్ చిన్నప్పుడు రామ చిలుకను పెంచుకోవాలనుకున్నాడు. పంజరంలో పెట్టి వాటి స్వేచ్ఛను హరించవద్దని తల్లి చెప్పడంతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నాడు. కానీ పక్షుల మీద ప్రేమ మాత్రం తగ్గించుకోలేదు. తను పెరిగినా కొద్దీ వాటిపై ప్రేమను మరింత పెంచుకున్నాడు. చిన్నప్పటి నుంచి వీధి కుక్కలు, పిల్లులు, చిలుకలు, పావురాలకు ప్రమాదం జరిగితే రక్షించడం మొదలు పెట్టాడు. 2006లో హైదరాబాద్కు మకాం మార్చిన ప్రదీప్ ఉద్యోగానికి వెళ్తున్న సమయంలో కోతి గాయపడడం చూశాడు. వెంటనే బ్లూ క్రాస్ వారికి సమాచారం ఇచ్చి, వారు కోతికి ఇచ్చిన చికిత్సను చూశాడు. అనంతరం తాను కూడా వారితో భాగస్వామ్యమై అనేక జంతువులు, పక్షులను కాపాడాడు. తన సేవలను మరింత విస్తరించాలని ఓ హెల్ప్లైన్ నెంబరు(9697887888)ను పెట్టుకుని 2019లో యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీని స్థాపించాడు.
అత్యవసర సేవలను అందిస్తూ…
ప్రదీప్ స్థాపించిన యానిమల్స్ వారియర్స్ కన్జర్వేషన్ సోసైటీ ప్రతినిధులు 2020లో 300, 2021లో 260, తాజాగా 130 పక్షులు, ఇతర జంతువులను కాపాడారు. కేరళ వరదలు, విశాఖ గ్యాస్ లీక్ సమయంలో కూడా అక్కడి అధికారులు ప్రదీప్ టీం సేవలను వాడుకున్నారు. ఒక జంతువును కాపాడేందుకు ఈ టీం ప్రతినిధులు అగ్నిమాపక శాఖ, డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బందితో కలిసి 3 నుంచి 4 రోజులు శ్రమించిన సందర్భాలూ ఉన్నాయి.
పిల్లులు రక్కుతాయి…
బావి, బోరు గుంత, ఇతర లోతైన ప్రాంతాల్లో జంతువులు పడ్డప్పుడు వాటిని తీయడానికి చాలా శ్రమించాల్సి ఉంటుంది. దీని కోసం ప్రదీప్ టీం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ముఖ్యంగా పిల్లులను కాపాడే సమయంలో అవి తీవ్రంగా ప్రతిఘటిస్తాయి. ఆ సమయంలో పిల్లుల కండ్లపై ఓ బట్టను వేసి మెల్లిగా బయటికి తీసుకువస్తారు. కుక్కలు మాత్రం సహకరిస్తాయని ప్రతినిధులు చెబుతున్నారు. అమీన్పూర్ చెరువులో ఓ హంస చేపలు తినడానికి వెళ్లినప్పుడు దాని నోటికి దారాలు చుట్టుకున్నాయి. దాదాపు 4 గంటల పాటు కష్టపడి దారాలను తొలగించారు. తాము కాపాడిన పక్షులను అటవీ శాఖ అధికారులకు, బ్లూ క్రాస్ సంస్థలు, పునరావాస కేంద్రాలకు తరలిస్తారు.
1600 పిచ్చుకల బాక్సుల పంపిణీ..
హైదరాబాద్లో పిచ్చుకలు కనపడడం లేదని ప్రదీప్ చేసిన పరిశోధనలో వాటికి గూడు లేకపోవడం గమనించాడు. దీంతో పిచ్చుకల కోసం చెక్క బాక్సులను రూపొందించి ఇంట్లో పెట్టుకున్నాడు. కొన్ని నెలల తర్వాత ఓ పిచుక వచ్చి ఆ గూడులో పిల్లలను పెట్టింది. మళ్లీ పిచ్చుకల సందడికి మురిసిపోయిన ప్రదీప్ దాదాపు 1600 పిచ్చుకల గూళ్లను తయారు చేసి పంపిణీ చేశాడు. ఇప్పుడు ఆ 1600 పిచ్చుకల గూళ్లలో దాదాపు 15 వేల పిచ్చుకలు పుట్టి ప్రశాంతంగా జీవిస్తున్నాయని ప్రదీప్ చెప్పాడు.