సిటీబ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ): క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెడితే భారీ లాభాలొస్తాయంటూ నమ్మించిన సైబర్నేరగాళ్లు నగరానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగికి రూ.27 లక్షలు టోకరా వేశారు. రెజిమెంటల్ బజార్కు చెందిన బాధితుడి ఫోన్ నంబర్ను క్రిప్టోకరెన్సీ వాట్సాప్ గ్రూప్లో గుర్తుతెలియని వ్యక్తులు యాడ్ చేశారు. కొన్నాళ్లు ఆ గ్రూప్లో లాభాలొస్తున్నాయంటూ చాటింగ్ చేశారు. దానికి ఆకర్షితుడైన బాధితుడు వారితో మాటలు కలిపాడు. అయితే యూఎస్డీటీ అనే క్రిప్టోకరెన్సీలో భారీ లాభాలొస్తున్నాయంటూ ఆ గ్రూప్లో ఉన్న సైబర్నేరగాళ్లు నమ్మించారు. పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నానంటూ బాధితుడు ముందుకు రావడంతో ఓ లింక్ను పంపించారు. ఆ లింక్ క్లిక్ చేయగానే ఒక ట్రేడింగ్కు సంబంధించిన యాప్ డౌన్లోడ్ అయ్యింది. అందులో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టగానే మరుసటి రోజు రూ.30 వేల లాభం వచ్చింది. దాన్ని బాధితుడు తీసుకున్నాడు.
ఇక నమ్మకం కుదరడంతో సైబర్నేరగాళ్లు కూడా ఇంకా ఎక్కువ పెట్టుబడి పెడితే భారీ లాభాలొస్తాయంటూ నమ్మించారు. దీంతో రూ.8 లక్షల పెట్టుబడి పెట్టాడు. మరుసటి రోజు రూ.90 లక్షల లాభం కనిపించింది. అయితే వచ్చిన లాభాలలో తమకు 20శాతం చెల్లించాలంటూ నేరగాళ్లు షరతు విధించారు. వచ్చిన డబ్బులో నుంచి మినహాయించుకొని మిగతావి తనకు ఇవ్వాలంటూ బాధితుడు కోరగా.. అలా కుదరదని, అందులో నుంచి మేము తీయడానికి వీలుండదని, మాకు డబ్బు చెల్లించిన తరువాత మొత్తం డ్రా చేసుకోవచ్చంటూ నమ్మించారు. వారి మాటలు నమ్మిన బాధితుడు రూ.18 లక్షలు నేరగాళ్లకు చెల్లించాడు. తరువాత యాప్లో డ్రా చేసుకునే వీలు లేకుండా పోయింది, ఫోన్ చేస్తే ఎవరూ స్పందించలేదు. ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు సోమవారం సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.