హైదరాబాద్ : కొవిడ్ మహమ్మారి విజృంభన నేపథ్యంలో నగర పౌరుల అవగాహన నిమిత్తం వరుస కార్యక్రమాలు చేస్తున్న హైదరాబాద్ పోలీసులు బుధవారం బషీర్బాగ్ కూడలిలో వాహనదారులకు అవగాహన కల్పించారు. ఇతర పోలీసు అధికారులతో కలిసి సీపీ అంజనీకుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాస్కులు ధరించండి.. మీ కుటుంబాన్ని రక్షించండి అనే స్లోగన్స్ ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు.
కొవిడ్ కేసులు పెరుగుతున్నందున బహిరంగ ప్రదేశాల్లో మాస్కుల వినియోగం ఎంత అవసరమో ఈ సందర్భంగా వాహనదారులకు అవగాహన కల్పించారు. అడిషన్ సీపీ(క్రైమ్స్) షిఖా గోయల్, అడిషన్ సీపీ(ట్రాఫిక్) అనిల్ కుమార్, జాయింట్ కమిషనర్ స్పెషల్ బ్రాంచ్ తరుణ్ జోషి, ఇతర అధికారులు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.