సిటీబ్యూరో, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ) :పుస్తక పఠనంతోనే పరిపూర్ణత సాధ్యమవుతుందని రాష్ట్ర సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్ బుద్ధా మురళి అన్నారు. తెలంగాణ కళాభారతిలో నిర్వహిస్తున్న జాతీయ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనను సమాచార హక్కు చట్టం కమిషనర్ కట్టా శేఖర్రెడ్డితో కలిసి గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రోజూ ఒక గంటపాటైనా పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని సూచించారు. పుస్తకంలో ఉన్న అనేక విషయాలు మనల్ని, మన ఆలోచనా విధానాన్ని పెంపొందించేందుకు దోహదపడుతాయని అన్నారు. విజేతలందరూ పుస్తకాలు చదివే తాము అనుకున్న లక్ష్యాలను చేరుకున్నారని పేర్కొన్నారు. వానెన్ బఫెట్ లాంటి వారు సైతం ఎంతో బిజీగా ఉన్నా ప్రతిరోజు 50 పేజీల వరకు పుస్తకాన్ని పఠిస్తారని చెప్పారు. కట్టా శేఖర్రెడ్డి మాట్లాడుతూ.. సమాజాన్ని అర్థం చేసుకునేందుకు పుస్తకాలు ఎంతో తోడ్పడుతాయని, తాను చదువుకున్న రోజుల్లో సోషల్ మీడియా లేదని, సమాచారమంతా పుస్తకాల ద్వారానే సేకరించే వారమని గుర్తుచేసుకున్నారు.
పుస్తకాన్ని ప్రేమించిన వారు తన తల్లిదండ్రులు, కుటుంబం, సమాజం, తోటి స్నేహితులను తప్పకుండా ప్రేమిస్తారని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ అన్నారు. పుస్తకమే మన నడవడి, ముందువడి కావాలని పిలుపునిచ్చారు. ప్రతిఒక్కరూ విధిగా ఏదో ఒక పుస్తకం చదివితే జ్ఞానం సిద్ధిస్తుందన్నారు. పుస్తకాలను అభ్యసించడం వల్ల ఉన్నత శిఖరాలకు చేరుకోగలమని బుక్ఫెయిర్ ప్రధాన కార్యదర్శి కోయ చంద్రమోహన్ అన్నారు.
తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, పుస్తక ప్రదర్శన ప్రధాన కార్యదర్శి కోయ చంద్రమోహన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుస్తక నడక (బుక్వాక్) అందరినీ ఆలోచింపజేసింది. సాహితీ ప్రియులు, విద్యార్థులు, కవులు, కళాకారులు, రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్యాంక్బండ్ వద్ద గల మైసమ్మ గుడి వద్ద నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్ నేరేళ్ల వేణుమాదవ్ ప్రాంగణం వరకు బుక్ వాక్ కొనసాగింది. ముఖ్యఅతిథిగా రాష్ట్ర సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్ బుద్ధా మురళి, రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ ప్రొఫెసర్ షహబాజ్ అహ్మద్, అక్షరాభ్యాస్ ప్రతినిధి బాల్నర్సయ్య, పలు కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
అక్షరయోధులు, కళామాతల్లి బిడ్డలకు సాహితీ నివాళులర్పించారు. హైదరాబాద్ పుస్తక ప్రదర్శన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జూలూరి గౌరీ శంకర్, కోయ చంద్రమోహన్ ఆధ్వర్యంలో బుక్ ఫెయిర్ ప్రాంగణంలో రచయితలు, కవులు, గాయకుల చిత్రపటాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ‘పాలపిట్ట-ఏనుగు నర్సింహారెడ్డితో సంభాషణ’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లో సిటీ కళాశాల ఆధ్వర్యంలో చిందు ఎల్లమ్మ వేదికపై మన చరిత్ర-మన సంస్కృతిపై తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరి గౌరీ శంకర్ అధ్యక్షతన గురువారం చర్చా కార్యక్రమం జరిగింది. ప్రముఖ చరిత్ర కారుడు హరగోపాల్ మాట్లాడుతూ అధ్యయనం నుంచే తెలంగాణ ఆవిర్భావం జరిగిందన్నారు. కార్యక్రమంలో రచయిత సంగిశెట్టి శ్రీనివాస్, చరిత్ర కారుడు, రచయిత ఈమని శివనాగిరెడ్డి, విశ్రాంత ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ, సిటీ కళాశాల ప్రిన్సిపాల్ బాలభాస్కర్, కోయి కోటేశ్వర్రావు , బుక్ఫెయిర్ కార్యదర్శి కోయ చంద్రమోహన్, తదితరులు పాల్గొన్నారు.