సెలవులు కావడంతో పెరిగిన సందర్శకులు
చిన్నారుల బుక్ స్టాల్స్కు పోటెత్తిన జనం
సుమారు 4 లక్షల మంది సందర్శన
సిటీబ్యూరో, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లో కొనసాగుతున్న 34వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన నిత్యస్ఫూర్తినిస్తున్నది. శని, ఆదివారాలు సెలవు కావడంతో చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులు బుక్ ఎగ్జిబిషన్కు పోటెత్తారు. ఇప్పటి వరకు సుమారు 4 లక్షల మంది సందర్శించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
వండర్స్ సైన్స్ షో..
చిందు ఎల్లమ్మ వేదికపై ఆదివారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వండర్స్ సైన్స్ షో నిర్వహించారు. సైన్స్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జేవీవీ అధ్యక్షుడు కోయ వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. అంకెల మామయ్య చంద్రయ్య మాట్లాడుతూ.. జ్ఞానానికి మూలం ప్రశ్నే అని అన్నారు. ప్రగతికి ప్రశ్నే మూలమని, మూఢ నమ్మకాలను విద్యార్థులకు బోధించకూడదని చెప్పారు. ఈ సందర్భంగా పలు సైన్స్ ప్రయోగాలు విద్యార్థులను అమితంగా
ఆకట్టుకున్నాయి.
కవిత్వం సామాన్యుడికి అర్థమయ్యేలా రాయాలి.. –చుక్కా రామయ్య
కవిత్వం సామాన్యుడికి అర్థమయ్యేలా రాయాలని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ అధ్యక్షతన మహా కవి గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన కవిసేన మ్యానిఫెస్టో గ్రంథాన్ని చుక్కా రామయ్య ఆవిష్కరించారు. అనంతరం రామయ్య మాట్లాడుతూ.. పాండిత్యం అందరికీ రాకపోవచ్చు, కానీ కవిత్వం మాత్రం ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలన్నారు. చెరబండ రాజు, శివసాగర్, వంగపండు, కాళోజీ లాంటి మహోన్నత కవులు, రచయితలు అందరికీ ఆదర్శమని అన్నారు. కవిసేనా నాయకుడు శేషేంద్ర శర్మ అని ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. పుస్తకావిష్కరణలో బుక్ఫెయిర్ కార్యదర్శి కోయ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.
పుస్తకంతోనే మేధస్సు వృద్ధి ..
డాక్టర్ పి.యువరాజ్ రచించిన ‘ది పవర్ ఆఫ్ ప్రెజెంట్’ పుస్తకాన్ని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య ఆవిష్కరించి, పుస్తకంతోనే మేధస్సు వృద్ధిచెందుతుందన్నారు. అన్ని అంశాలు ‘ది పవర్ ఆఫ్ ప్రెజెంట్’లో ప్రతిబింబిస్తాయని తెలిపారు. మనిషికి కావాల్సిన ప్రాథమిక హక్కులను డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపర్చారన్నారు. ఈ సందర్భంగా జాగృతి స్టాల్ను హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య, సీనియర్ పాత్రికేయుడు కె.రామచంద్రమూర్తి, బీసీ కమిషన్ సభ్యులు సందర్శించారు.
‘ఇగురం’ కథా సంపుటి ఆవిష్కరణ
జర్నలిస్టు గంగాడి సుధీర్ రచించిన ‘ఇగురం’ కథా సంపుటిని ఆదివారం 34వ నేషనల్ హైదరాబాద్ బుక్ ఫెయిర్లోని చిందు ఎల్లమ్మ వేదికపై సీనియర్ జర్నలిస్టు కె. రామచంద్రమూర్తి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, మాజీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షురాలు కవిత చల్లా, సీనియర్ పాత్రికేయులు శైలేశ్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు.
‘ఇందిరా పరిమి రచనలు ఎన్సైక్లోపీడియా’
తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లో కొనసాగుతున్న 34వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో భాగంగా చిందుఎల్లమ్మ వేదికపై రబుల్ ధమాకా రచయిత్రి, జర్నలిస్ట్ ఇందిరా పరిమితో ఇష్టాగోష్టి కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ సీనియర్ జర్నలిస్టు కె.రామచంద్రమూర్తి ఆత్మీయ ప్రసంగం చేశారు. ఎమ్మెస్కో విజయకుమార్, ఇందిరా పరిమి రచనలు మినీ సినీ ఎన్సైక్లోపీడియా అవుతుందని ప్రముఖ జర్నలిస్ట్ రెంటాల జయదేవ్ అన్నారు.