మహానగరం రూపు మారుతోంది.. మెట్రో నగరాలకు దీటుగా వృద్ధి చెందుతున్నది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన ఐటీ కంపెనీలు కొలువై ఉండడం, దిగ్గజ ఫార్మా సంస్థలు నెలకొని ఉండడంతో నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా బహుళ అంతస్తుల సముదాయాలు వెలుస్తున్నాయి. ఇప్పటికే పశ్చిమాన భారీ భవంతుల నిర్మాణాలు జరుగుతుండగా, జీహెచ్ఎంసీ పరిధిలో 54 అంతస్తుల భారీ భవన నిర్మాణానికి ఓ కంపెనీ దరఖాస్తు చేసింది. బల్దియా పరిధిలో ఇప్పటివరకు 44 అంతస్తుల భవనం పెద్దది కాగా, 54 అంతస్తులకు అనుమతి లభిస్తే ఇదే తొలి స్థానంలోకి చేరుతుందని అధికారులు అంటున్నారు. శేరిలింగంపల్లి మండలం మదీనాగూడలో మూడున్నర ఎకరాల్లో మూడు టవర్లను నిర్మించనున్నారు. అయితే హెచ్ఎండీఏ పరిధిలోని కోకాపేటలో 58 అంతస్తుల భవంతి నిర్మాణానికి ఇప్పటికే అనుమతి లభించింది.
సిటీబ్యూరో,డిసెంబర్ 22(నమస్తేతెలంగాణ): మహానగరం విశ్వనగరం వైపు అడుగులు వేస్తున్నది. ప్రసిద్ధ ఐటీ, ఐటీయేతర కంపెనీలు నగరానికి క్యూ కడుతుండడంతో ఇక్కడ బహుళ అంతస్థుల భవనాలు నిర్మాణమవుతున్నాయి. ఇప్పటికే నగరానికి పశ్చిమాన విశాలమైన రహదారులు,ఆకాశహర్మ్యాలు అభివృద్ధికి సూచికలు. గ్రేటర్ హైదరాబాద్లో ఇతర మెట్రో నగరాలకు దీటుగా అతిపెద్ద నివాస సముదాయాలు భారీగానే నిర్మాణమవుతున్నాయి. ఈ బహుళ అంతస్తుల భవనాల జాబితాలో మరొక ప్రాజెక్టు వచ్చి చేరబోతున్నది. ఇప్పటికే 58 అంతస్తులతో హెచ్ఎండీఏ పరిధిలోని కోకాపేటలో అతిఎత్తయిన నిర్మాణ పనులు జరుగుతుండగా, 54 అంతస్తులతో మరో రియల్ ఎస్టేట్ సంస్థ నిర్మాణానికి సిద్ధమైంది.
రెండో అతిపెద్ద ఆకాశహర్మ్యానికి అనుమతి ఇవ్వాలని జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకున్నది. ప్రస్తుతం అగ్నిమాపక విభాగం నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) తీసుకునే ప్రక్రియ జరుగుతుండగా, కమిషనర్ లోకేష్కుమార్ ఆమోదముద్ర పడిన వెంటనే నిర్మాణానికి అడుగులు పడనున్నాయి. బల్దియా పరిధిలో ఇప్పటివరకు 44 అంతస్తుల భవనం అతి పెద్దది కాగా, 54 అంతస్తులకు అనుమతి లభిస్తే ఇదే తొలి స్థానంలోకి చేరుతుందని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. కోకాపేటలో 58 అంతస్తుల నిర్మాణానికి ఇటీవల హెచ్ఎండీఏ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పటివరకు ఐటీ కారిడార్లోనే భారీ బహుళ అంతస్తుల భవనాలు వస్తుండగా, తాజాగా మియాపూర్, చందానగర్, నిజాంపేట, బాచుపల్లి ప్రాంతాల్లో హైరైజ్ భవనాల నిర్మాణం ఊపందుకున్నది.
శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని మదీనాగూడలో 54 అంతస్తులతో భారీ టవర్ల నిర్మాణానికి క్యాండూర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ సంస్థ జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకున్నది. 4 సెల్లార్లు, గ్రౌండ్ ప్లస్ 49 అంతస్తులతో నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమైంది. సుమారు 3 ఎకరాల విస్తీర్ణంలో 3 టవర్లను అత్యాధునిక సదుపాయాలతో హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుగా చేపడుతున్నారు. శేరిలింగంపల్లి మండలం మదీనాగూడ సర్వే నంబర్లు 200/ఎ, 200/ఎఎ, 201/ఎ, 205/2/ఎఎలోని మొత్తం 14696.57 చదరపు మీటర్లలో ఈ సంస్థ ఈ ప్రాజెక్టును చేపట్టనున్నది.