హుజూరాబాద్: బీజేపీ నేత ఈటల రాజేందర్ పై పాడి కౌశిక్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఓడిపోతానని ఈటలకు అర్థమైందని, ఆ ఫ్రస్ట్రేషన్ తోనే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. శుక్రవారం హుజూరాబాద్ లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ గెలిచి ఏడేండ్లలో దేశానికి ఏం చేసింది? తెలంగాణకు ఏం చేసింది? ఇప్పుడు ఏం చేస్తుంది? తెలంగాణపై నిజంగా ప్రేమ ఉంటే తెలంగాణలోని ఏడు మండలాలను ఎందుకు ఏపీలో కలిపారు? బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వాలని విభజన చట్టంలో ఉంది. గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలని ఉంది. మరి వాటిని ఎందుకు ఇవ్వటం లేదు? ఏపీకి చెందిన పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. కాళేశ్వరాన్ని ఎందుకు ప్రకటించలేదు? ఐటీఐఆర్ రద్దు చేసి తెలంగాణ యువతకు ఉద్యోగాలు లేకుండా ఎందుకు చేసింది? పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి ఎందుకు విరుస్తున్నారు? బీఎస్ఎన్ఎల్, బీడీఎల్, ఎల్ఐసీ వంటి సంస్థలు అమ్మి ఉద్యోగులను రోడ్డు మీద ఎందుకు పడేస్తున్నారు? ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టి అంబేద్కర్ తెచ్చిన దళిత, గిరిజన, ఓబీసీ రిజర్వేషన్లు ఎందుకు తీసేస్తున్నారు?’ అని ప్రశ్నించారు.
హరీశ్ రావు ఈ ప్రశ్నలడిగితే కోపం ఎందుకు.. ఈటలా?
‘బీజేపీలో చేరావు. హామీల అమలుకు కేంద్రాన్ని అడగాలని హరీశ్ రావు అనటం తప్పా? హుజూరాబాద్ ప్రజల కోసం ఓ రూ. 5వేల కోట్ల ప్యాకేజీ ఢిల్లీ నుండి తీసుకురమ్మని అడిగారు. ఇది తప్పా? మంత్రిగా ఇండ్లు కట్టలేదు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏం అభివృద్ధి చేస్తారో? హుజూరాబాద్ ప్రజలకు చెప్పండని హరీశ్ అడిగారు. ఇది తప్పా? వీటికి సమాధానం ఇవ్వకుండా మంత్రి హరీశ్ రావుపై విమర్శలు చేయటం ఏంటి? నిస్పృహతోనే ఆయనపై విమర్శలు చేస్తున్నావ్. హరీశ్ రావు పార్టీ లైన్, పార్టీ చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. నువ్వు నీ పార్టీ లైన్ చెప్పు. గెలిపిస్తే ప్రజలకు ఏం చేస్తావో చెప్పు. వ్యక్తిగత విమర్శలతో ప్రజలను మభ్య పెట్టే రాజకీయాలు వద్దు’ అని ఈటలకు కౌశిక్ రెడ్డి హితవు చెప్పారు.
మా రాజకీయాలు రాష్ట్ర అభివృద్ధి, హుజూరాబాద్ అభివృద్ధి మీదే ఉంటాయ్
‘నిన్నటి దాకా నా మిత్రుడు హరీశ్ అన్నావు. ఇప్పుడు నీ అంతు చూస్తా అని బెదిరిస్తున్నావు. ఒక్క రోజులో ఈ మార్పు ఎందుకు? హుజూరాబాద్ ప్రజలు ఆలోచిస్తున్నారని నీకు అర్థమయింది. అందుకే వ్యక్తిగత విమర్శలు చేస్తూ రెచ్చగొడుతున్నావు. అలా సానుభూతి పొందితే నాలుగు ఓట్లు వస్తాయన్నది నీ రాజకీయం. మంత్రి హరీశ్ వేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వు. ప్రజలకు సమాధానం చెప్పు. దానిపై అంతిమ తీర్పు ప్రజలే చెప్తారు’ అని అన్నారు. బీజేపీ నాయకత్వం పట్టించుకోక, ప్రజల నుండి ఆదరణ కరువై ఈటల రాజేందర్ ప్రస్టేషన్ లో హరీశ్ రావుపై పిచ్చికూతలు కూస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఖబడ్దార్ ఈటల రాజేందర్..
‘అన్నం పెట్టిన కేసీఆర్ గారికే సున్నం పెట్టిన నువ్వూ ఒక మనిషివా. తండ్రి లాంటి కేసీఆర్ ను తిడుతావా? తిన్నకంచంలోనే పోయే సంస్కారహీనుడవు నీవు. బీసీ నాయకునివని, సీఎం కేసీఆర్ గొప్ప అవకాశాలు కల్పిస్తే పదవి కోసం అత్యాశతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై పిచ్చుకూతలు కూస్తున్నావ్. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు. బూతు పార్టీలోకి పోగానే సంస్కారహీనుడిగా మాట్లాడుతున్నావు. కమ్యూనిస్ట్ అని చెప్పుకుంటూ కరెప్షనిస్టుగా మారి చివరకు కన్నింగ్ అయ్యావు. ధర్మం గల్ల బిడ్డను అని చెప్తావ్. ఏది నీ ధర్మం ఈటల? అన్నం పెట్టిన కేసీఆర్ ను దూషించటం నీ ధర్మమా? ధర్మం అంటే జీవితాన్నిచ్చిన వాళ్ళను తిట్టడమా?’ అని ఈటలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోయిలేని దద్దమ్మవు..
‘సోయిలేని దద్దమ్మను నువ్వు. లంగా పనిచేసి పదవి పోగానే ఏదో ఉద్దరించినట్టు పార్టీ మారిన దరిద్రుడవు నువ్వు. బీజేపీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి నీ బతుకు దెరువు కోసం అదే పార్టీలో చేరి నేడు కేసీఆర్ ను హరీశ్ ను విమర్శిస్తున్నవ్. నువ్వు తప్పులు చేసినా కేసీఆర్ నిన్ను భరించారు. ఆయన కాలి గోటికి కూడా సరిపోని నువ్వు ఆయన్ని దుర్భాషలాడుతున్నవ్. ఆత్మగౌరవం అని చెప్పి ఫాల్త్ మాటలు మాట్లాడుతున్నావ్. నాది బీసీ డీఎన్ఎ అనే నువ్వు.. నీ పిల్లలకు బీసీ పేరు ఎందుకు పెట్టుకోలేకపోయావ్. పార్టీని చీల్చాలని చూసిన నువ్వు ఆత్మగల్ల బిడ్డవెట్లైతవ్ ఈటల. బద్మాష్ వేషాలు వేస్తూ నీతులు వల్లిస్తున్నావా? మోదీ పేరు చెప్పడానికి సిగ్గుపడుతున్నావు. మేం గర్వంగా చెప్తం మేం కేసీఆర్ సైనికులం అని’ అని తెలిపారు.
గుమ్మడికాయ దొంగ ఎవరంటే..
‘ఎవరి కోసం రాజీనామా చేసావ్.. ఎవరు చేయమన్నారు నిన్ను. గుమ్మడికాయ దొంగ ఎవరంటే నేను కాదంటూ నీలాగే ఎనకటికి భుజాలు తడుముకున్నారంట. సిగ్గులేకుండా ఇంట్లో ఉంటూ ఇంటి విషయాలు ప్రత్యర్థులకు చేరవేసిన దొంగవు నువ్వు. అలాంటి నువ్వు పార్టీ కోసం పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న హరీశ్ రావుపై చిల్లర మాటలు మాట్లాడుతవా? సిగ్గుండాలి. మంత్రి పదవి ఆలస్యమైనా కేసీఆర్ నాయకత్వంలోనే క్రమశిక్షణగా పనిజేసిన హరీశ్ ఎక్కడ. పదవి పోగానే పక్కదారులు వెతికి జీవితాన్నిచ్చినోన్నే అడ్డగోలుగా తిడుతున్న నువ్వెక్కడ. నీకు, హరీశ్ రావుకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. సిగ్గులేకుండా విమర్శలు చేస్తున్నావా?
ప్రజలను పట్టించుకోని దద్దమ్మవు..
‘సొంత నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను పట్టించుకోని దద్దమ్మవు నువ్వు. రాష్ట్రంలో ఏ మూల నుండి వచ్చినా వాళ్ళ సమస్యను తీర్చే గొప్ప వ్యక్తి హరీశ్ రావు. సన్నాసుల పార్టీలో చేరగానే సన్నాసిలా వ్యవహరిస్తున్నావ్. అబద్ధాలు చెప్తున్నవ్, సంస్కారం వదిలేసి నువ్వూ ఓ సన్నాసిగా మారావు. నువ్వు గడియారాలు, గ్రైండర్లు పంచింది నిరూపిస్తాం. దొంగ పనులు చేసి సిగ్గులేకుండా సవాలు విసురుతున్నావా. నువ్వు పంచిన గడియారాలు తెమ్మంటవా? దొంగపని చేసి రాజీనామా చేసింది నువ్వు. ప్రజాదరణతో ప్రజల మెప్పు పొందుతున్న నేత హరీశ్ రావు. అలాంటి నేతపై విమర్శ చేయటం అంటే నీ మొహంపై నువ్వే ఉమ్మేసుకోవటం. నిన్ను కేసీఆర్ పక్కన కూర్చోబెట్టుకున్నారు. నిన్ను గొప్పగా చూసుకున్నారు. నువ్ పార్టీ మారితే నిన్ను చేర్చుకోటానికి పార్టీ అధ్యక్షుడు కూడా రాలేదు. నీ స్థాయి ఏంటో తెలుసుకో’ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
పేదల భూములు లాక్కున్న దొంగవు..
పేద ప్రజల భూములు లాక్కున్న దొంగ ఈటల రాజేందర్ అని, తెలంగాణాకు అన్యాయం చేస్తున్న దుష్టులతో చేరి రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చాలని చూస్తున్నాడని కౌశిక్ రెడ్డి అన్నారు. ‘ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఎదగనివ్వకుండా ముప్పతిప్పలు పెట్టిన మూర్కుడవు నీవు. హుజూరాబాద్ లో సొంత పార్టీ నాయకులను కేసుల పాలు చేసి వికృతానందం పొందినవ్. దళితులకు దళితబందు వస్తుంటే అసత్యాలు ప్రచారం చేస్తున్నవ్. ఓట్ల కోసం అబద్ధాలు ప్రచారం చేస్తున్నవ్. హుజూరాబాద్ ప్రజలు నీకు కర్రు కాల్చి వాతపెడ్తరు. పిచ్చికూతలు ఆపు’ అని స్పష్టంచేశారు.
వాపును బలుపు అనుకుంటున్నాడు
‘ఈటల వెంట కనీసం ఒక్క గులాబీ కార్యకర్త అయినా వెళ్ళలేదంటే అయనను ప్రజలు ఎంతగా అసహ్యించుకుంటున్నారో అర్థమవుతోంది. ఈటల వాపును చూసి బలుపు అని అనుకుంటున్నారు. హరీశ్ రావును చూస్తేనే ఈటలకు భయమేస్తోంది. ఈటలకు అధికార దాహం తప్ప ప్రజాసేవ ధ్యాసే లేదు. మేక వన్నె పులి. ఈటల ఎన్ని ప్రగల్భాలు పలికినా హుజురాబాద్ లో ఉద్యమ బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయం’ అని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు.