హైదరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా సాగింది. ఉదయం 7 గంటల పోలింగ్ మొదలవగా.. రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. పోలింగ్ గడువు ముగిసే వరకు పలువురు ఓటర్లు కేంద్రాల్లో బారులు తీరగా.. వారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. 7 గంటల వరకు 86.33 శాతం పోలింగ్ నమోదవగా.. మరికొంత పెరిగే అవకాశం ఉన్నది. ఇంతకు ముందు 2018 ఎన్నికల్లో హుజూరాబాద్లో 84.5శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ పూర్తయిన చోట్ల ఎన్నికల సిబ్బంది ఈవీఎంలను సీజ్ చేస్తున్నారు. పటిష్ట బందోబస్తు మధ్య వాటిని వాహనాల్లో కరీంనగర్లోని ఎస్సారార్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్కు తరలిస్తున్నారు.