హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 31(నమస్తే తెలంగాణ): ‘ఇక నుంచి మద్యం తాగను.. మరోసారి తప్పు చేయను.. నన్ను విడిచిపోయిన భార్యతో కలపండి..’ ఇది హైదరాబాద్కు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి షీ టీమ్స్కు పెట్టుకొన్న మొర! సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి తాగుడుకు అలవాటుపడ్డాడు. మద్యం మత్తులో భార్యను వేధించేవాడు. ఆమె చాలాకాలం భరించింది. తాగుడు, వేధింపులు మరీ ముదరడంతో కొద్దిరోజుల క్రితం ఆమె అతణ్ణి వదిలేసి వెళ్లిపోయింది. భార్య దూరమైన తర్వాత ఆమె లేని లోటు తెలిసొచ్చింది. ఒంటరి జీవితం భారమైంది. దీంతో సైబరాబాద్ భరోసా కేంద్రంలోని షీ టీమ్స్ అధికారులను ఆశ్రయించాడు. తనకు తన భార్య కావాలని, తామిద్దరినీ కలపాలని ఆర్ధించాడు. మళ్లీ మందు ముట్టనని, భార్యను వేధించనని హామీపత్రం రాసిచ్చాడు. భార్యను బాగా చూసుకొంటానని, లేదంటే చట్టప్రకారం తనపై చర్యతీసుకోవాలని పేర్కొన్నాడు. దీంతో షీ టీమ్స్ ప్రతినిధులు సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్యతో ఫోన్లో మాట్లాడారు. ఆమె మెట్టు దిగలేదు. ఇంకా అంగీకారం తెలపలేదు. తమ పెద్దలతో మాట్లాడి, నిర్ణయం తీసుకొంటానని చెప్పింది. దీంతో ఆమెతో మరోసారి మాట్లాడి, ఇద్దరినీ కలిపేందుకు ప్రయత్నించాలని షీ టీమ్స్ అధికారులు భావిస్తున్నారు. ఇటీవల సైబరాబాద్ షీ టీమ్స్ అధికారులు గృహహింస వేధింపుల కారణంగా విడిపోయిన 32 జంటలను కలిపి, సంతోషంగా జీవించే మార్గాన్ని చూపించారు.