న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: హెచ్యూఎల్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.2,307 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2,190 కోట్ల లాభంతో పోలిస్తే కేవలం 5.34 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 10.21 శాతం పెరిగి రూ.12,220 కోట్ల నుంచి రూ.13,468 కోట్లకు చేరుకుంది.
గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.50 వేల కోట్ల టర్నోవర్ సాధించింది సంస్థ. ఇలా ఒక్క ఏడాదిలో ఇంతటి స్థాయిలో ఆదాయం సాధించిన తొలి ఎఫ్ఎంసీజీ హెచ్యూఎల్ కావడం విశేషం. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.51,472 కోట్ల ఆదాయంపై రూ.8,892 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసుకున్నది.
ఆదాయంలో 11.25 శాతం వృద్ధిని కనబరుచగా, నికర లాభం 11.16 శాతం ఎగబాకింది. ఎబిటా మార్జిన్ 24.6 శాతంగా నమోదైంది. ఏడాది క్రితం రూ.9,667 కోట్లగా సంస్థ నిర్వహణ ఖర్చులు గత త్రైమాసికానికిగాను రూ.10,782 కోట్లకు పెరిగాయి. కంపెనీ షేరు ధర స్వల్పంగా తగ్గి రూ.2,144.25 వద్ద ముగిసింది.
‘ఇబ్బందికర పరిస్థితుల్లోనూ బిజినెస్ మోడల్తో నిలకడైన వృద్ధిని సాధించడం జరిగింది. నిరుడు రూ.50 వేల కోట్ల టర్నోవర్ సాధించిన తొలి సంస్థ మాదే. విక్రయాలు ఆశాజనకంగా ఉండటంతో ఆదాయంలో రెండంకెల వృద్ధి నమోదైంది.
– సంజీవ్ మెహతా, హెచ్యూఎల్ సీఈవో, ఎండీ