న్యూయార్క్, జనవరి 30: అమెరికా తూర్పు రాష్ర్టాల్లో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తున్నది. దట్టంగా కురుస్తున్న మంచుతో పాటు తీవ్రమైన చలిగాలులతో అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచుతో ఇండ్లు, రహదారులపై మంచు గుట్టలుగా పేరుకుపోతున్నది. దాదాపు అడుగు ఎత్తు మేర మంచు పేరుకుపోవడంతో రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. మంచు ధాటికి పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. మసాచుసెట్స్లోని కొన్ని ప్రాంతాల్లో 1,17,000 ఇండ్లకు ఇప్పటికే విద్యుత్తు సరఫరా కట్ అయినట్టు నివేదికలు వస్తున్నాయి.
3,500 విమాన సర్వీసులు రద్దు
మంచు బీభత్సం నేపథ్యంలో న్యూయార్క్, న్యూజెర్సీ, వర్జీనియా, మేరీల్యాండ్, డెలావేర్ రాష్ర్టాల్లో అధికారులు అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ఈ మంచు తుపాను ‘బాంబ్ సైక్లోన్ (బాంబు తుఫాను)’గా మారిందని నేషనల్ వెదర్ సర్వీసు (ఎన్డబ్ల్యూఎస్) శనివారం ధ్రువీకరించింది. తీర ప్రాంతాల్లో ఒక అడుగు (30 సెంటీమీటర్ల) కంటే ఎక్కువ ఎత్తుగా మంచు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. మంచు తుఫాను తీవ్రత నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. తూర్పు తీర ప్రాంతాల నివాసితులు ఇండ్లలోనే ఉండాలని, అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని కోరారు. మాన్హట్టన్ ఉత్తరద్వీపంలో ఇప్పటికే 25 సెంటీమీటర్ల మేర మంచు పేరుకుపోయింది. ట్రాకులపై మంచు ఉండడంతో పలు రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. శనివారం 3,500 విమాన సర్వీసులను రద్దు చేశారు.