న్యూఢిల్లీ, జనవరి 22: ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో భారీ ఉత్పాదక సదుపాయాలు కలిగిన ఏజీఐ గ్లాస్ప్యాక్..భువనగిరిలో తాజాగా రూ. 400 కోట్ల పెట్టుబడితో మరో గ్లాస్ ప్లాంట్ను వచ్చే వారంలో ప్రారంభించనుంది. ఈ కొత్త ప్లాంట్తో ప్రత్యక్షంగా 700 మందికి, పరోక్షంగా 2,500 మందికి ఉపాధి లభించనున్నది. తాజా విస్తరణతో తెలంగాణ రాష్ట్రంలో కంపెనీ గ్లాస్ ప్లాంట్లలో మొత్తం ప్రత్యక్ష ఉద్యోగుల సంఖ్య 3,700కు చేరుతుంది. హెచ్ఎస్ఐఎల్కు చెందిన ప్యాకేజింగ్ డివిజన్లో భాగమైన ఏజీఐ గ్లాస్ప్యాక్ తాజాగా హైదరాబాద్లో ఒక పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) కేంద్రాన్ని సైతం నెలకొల్పుతున్నది. గ్లాస్, సంబంధిత ఉత్పత్తులపై పరిశోధన, అప్గ్రేడ్ కోసం పరిశోధనలు జరిపే ఈ కేంద్రంలో వచ్చే నెల నుంచి కార్యకలాపాలు మొదలవుతాయి. అలాగే ఒక కొత్త డిజైన్ సెంటర్ను కూడా ఏజీఐ ఏర్పాటుచేస్తున్నది.
1,750 టన్నులకు ఉత్పత్తి సామర్థ్యం..
విస్తరణ వివరాలను ఏజీఐ గ్లాస్ప్యాక్ ప్రెసిడెంట్, సీఈవో రాజేష్ కే ఖోస్లా వెల్లడిస్తూ ప్రస్తుతం తమకు 1,600 మెట్రిక్ టన్నుల రోజువారీ తయారీ సామర్థ్యం ఉందని, భువనగిరిలో కొత్త ప్లాంటు ఏర్పాటుతో 2022 మార్చికల్లా ఈ సామర్థ్యం 1,750 మెట్రిక్ టన్నులకు పెరుగుతుందన్నారు. స్పెషాలిటీ గ్లాస్ విభాగంలో పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా తాము కొత్తగా నెలకొల్పుతున్న ప్లాంట్లో కాస్మొటిక్స్, పెర్ఫ్యూమరీ వంటివాటికి క్లియర్ గ్లాస్ ఉత్పత్తుల్ని తయారు చేస్తామన్నారు. ఈ ఉత్పత్తులను దేశీయంగా సరఫరా చేయడంతో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తామని ఖోస్లా వివరించారు. ఏజీఐ గ్లాస్ప్యాక్కు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హైదరాబాద్లో ఒకటి, భువనగిరిలో మరో గ్లాస్ ప్లాంట్ ఉంది. కంపెనీ గ్లాస్ విభాగం టర్నోవర్ రూ. 1,200 కోట్లు ఉండగా, 2023కల్లా రూ. 1,700-1,900 కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు సీఈవో వెల్లడించారు. ఫుడ్, ఫార్మాస్యూటికల్స్, సాఫ్ట్డ్రింక్స్, స్పిరిట్స్, బీర్, వైన్ తదితర పరిశ్రమలకు తగిన ప్యాకేజింగ్ అవసరాలకు పటిష్టమైన నాణ్యతా ప్రమాణాలతో ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నామన్నారు.