హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): మేడారం మహాజాతరకు పకడ్బందీ ఏర్పాట్లుచేస్తున్నామని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ చెప్పారు. వచ్చేనెల 16 నుంచి 19 వరకు జరిగే జాతరలో అమ్మవార్లను దర్శించుకోవటానికి వచ్చే వీఐపీ, వీవీఐపీలకు ఇచ్చే పాస్ (సాట్ల)లలో వారు దర్శించుకొనే తేదీ, సమయం కచ్చితంగా ఉండేలా ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. తద్వారా సాధారణ భక్తుల దర్శనానికి ఎలాంటి ఇబ్బంది కలుగదని వెల్లడించారు. సమ్మక్క-సారలమ్మలు గద్దెల మీద కొలువైన రోజే సీఎం కేసీఆర్ దర్శించుకొని మొక్కులు చెల్లిస్తారని ఆమె సూచనప్రాయంగా చెప్పారు. బుధవారం శాసనమండలి ప్రాంగణంలో మేడారం జాతర ఏర్పాట్లను ఆమె మీడియాకు వివరించారు. గతంలో జాతరకు ఒకటి రెండు రోజుల ముందే జంపన్నవాగులోకి నీళ్లు వదిలేదని, ఈసారి నెల రోజుల ముందే నీటిని వదిలామని చెప్పారు.
కరోనా నిబంధనలను తప్పనిసరిగా భక్తులు పాటించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి నుంచే మెడికల్ క్యాంపులు పెట్టామని, జాతరనాటికి వీటిని మరింత విస్తరిస్తామని తెలిపారు. ఇప్పటికే రోజుకు మూడు లక్షల మంది భక్తులు మేడారానికి వస్తున్నారని ఆమె చెప్పారు. శాశ్వత ప్రాతిపదికన రెవెన్యూశాఖ నిర్మించిన గెస్ట్ హౌజ్ను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. జంపన్నవాగుకు ఇరువైపులా శాశ్వత నిర్మాణాలు చేపట్టామని మంత్రి చెప్పారు. గతంలో కంటే ఈసారి జాతరలో బయోటాయిలెట్స్ను భారీగా పెంచామని తెలిపారు. ఈ సారి జాతరలో 24/7 శానిటేషన్ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈసారి జాతరకు 4 నెలల ముందుగానే రూ.75 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని ఆమె గుర్తుచేశారు.