తేనె.. ఎన్నటికీ పాడైపోని ఒకే ఒక్క పదార్థం. ఆహారంగా మాత్రమే కాకుండా చర్మ, కేశ సంరక్షణలోనూ ఉపయోగపడుతుంది. ఈ మధుర పదార్థంతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో.
గాయాలకు మలాముగా
తేనెను కాలిన గాయాలకు ఆయింట్మెంట్లా ఉపయోగిస్తారు. తేనె గాయాలను క్రిమి రహితం (స్టెరిలైజ్) చేస్తుంది. అంతేకాదు గాయం బాధను, దుర్వాసనను తగ్గిస్తుంది. శస్త్రచికిత్స తర్వాత తలెత్తే దీర్ఘకాలిక అల్సర్లనూ నయం చేస్తుంది.
సంతాన సాఫల్యంలో
సంతాన సాఫల్యాన్ని పెంచే గుణం తేనెకు ఉంది. స్వల్పకాలిక, దీర్ఘకాలిక జ్ఞాపకశక్తిని కూడా మెరుగుపరుస్తుంది. దీనికి ఉన్న యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్ నివారణలో దోహదపడతాయి.
సోరియాసిస్ చికిత్సలో
సోరియాసిస్ చికిత్సలో డాక్టర్లు సాధారణంగా విటమిన్-డి క్రీములను సూచిస్తారు. వాటికి ప్రత్యామ్నాయంగానే కాదు, మరింత సమర్థంగా పనిచేస్తుంది తేనె. ఆలివ్ నూనె, తేనె, తేనెపట్టు మైనపు (బీస్వ్యాక్స్) మిశ్రమం.. చర్మం ఎర్రబడటం, పొలుసుబారటం, దురద లాంటివాటిని తగ్గిస్తుంది. తేనె గొప్ప మాయిశ్చరైజర్ కూడా. పై మూడింటితో పాటు కోకోవా వెన్న మిశ్రమంతో పెదవులకు బామ్ కూడా తయారు చేసుకోవచ్చు.
కేశాల ఆరోగ్యానికి
యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధమైన తేనె మాడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వెంట్రుకలు పొడి బారిపోకుండా, తేమ స్థాయిని నియంత్రిస్తుంది. జుట్టు రాలి
పోవడాన్ని కూడా నివారిస్తుంది.
పండ్ల నిల్వకు
ఈ పద్ధతిలో మొదట, ఖాళీ జాడీలను క్రిమి రహితం చేయాలి. కొన్ని నీళ్లు, చక్కెర, తేనె ఒక బాణలిలో తీసుకొని బాగా మరిగించాలి. ఇప్పుడు నిల్వ ఉంచాలనుకున్న పండ్లను ఆ మిశ్రమంలో కలపాలి. చిరు మంటపై కొన్ని నిమిషాలు అలానే ఉంచి, తరచుగా కలుపుతూ ఉండాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని జాడీల్లోకి ఎత్తుకోవాలి. గాలి
చొరకుండా మూసి, చల్లబడే దాక ఉంచాలి. తర్వాత వెలుతురు పడని చోట భద్రపరుచుకోవాలి. తెరవకుండా ఉంచితే ఆరు నెలల వరకు పండ్లను నిల్వ ఉంచుకోవచ్చు. తెరిస్తే మాత్రం ఫ్రిజ్లో ఉంచి పది రోజుల్లో వాడుకోవాలి.