హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ) : కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటోతేదీనే జీతాలు ఇస్తామని సీఎం రేవంత్ చెప్పిన మాట అబద్ధమని తేలింది. నిరంతరం శ్రమ దోపిడీకి గురవుతున్న హోంగార్డులకు ఎనిమిదో తేదీ వచ్చినా వేతనాలు అందలేదు. కాగా, ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలకు తోడు, హోంగార్డుల వినతిపత్రాలతో గత 9 నెలలపాటు ఇబ్బందులు లేకుండా వేతనాలు అందాయని హోంగార్డులు చెప్తున్నారు. కానీ, ఈ నెల మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చిందని వాపోతున్నారు. ఈ నెల 4 కమిషనరేట్లు, 5 జిల్లాల్లో మినహా మిగతాచోట్ల హోంగార్డులకు వేతనాలు అందలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
కాంట్రాక్ట్, ఔసోర్సింగ్లో రూ.25 వేల పై చిలుకు వేతనం ఉన్న ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా రూ.2 కోట్ల ప్రమాద బీమా కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా హోంగార్డులను చేర్చకపోవడం బాధాకరమని పేర్కొంటున్నారు. ఏడాది గడిచినా మరణించిన హోంగార్డు కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.