వాళ్లంతా నగరానికి బతకడానికి వచ్చిన రోజు వారి కూలీలు. దినసరి వేతనంపైనే బతుకుబండి నడపాలి. పొట్టకూటి కోసం హైదరాబాద్కు అతిథుల్లా వచ్చిన అనేక మంది ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో కరోనా బారినపడుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబాలకు ప్రాణసంకటంగా మారిన పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన కరోనా కిట్లతో మాత్రలు తీసుకుంటూ కోలుకుంటున్నారు. కానీ తినడానికే లేని పరిస్థితుల్లో పౌష్టికాహారం సమకూర్చుకోవడం వారికి కష్టంగా మారింది. ఊరు కానీ ఊరొచ్చిన వారికి అయినవారు లేరు. కష్టాలు చెప్పుకున్నా కడుపు నింపేవారు కరువయ్యారు. అలాంటి వారి గోస చూసిన ఆ ఆదర్శ దంపతులు వారికి అపరిచిత ఆత్మీయులుగా మారిపోయారు. ప్రతీ రోజు ఆహారం అవసరమున్న కరోనా బాధితులకు మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్లు అందిస్తూ వారి ఆకలితీరుస్తున్నారు. కరోనా నుంచి కోలుకునేవరకు తామున్నామంటూ బాసటగా నిలుస్తున్నారు. నిత్యం 200 మందికి సొంత ఖర్చులతో హైజనిక్ ఫుడ్ తయారు చేసి అందిస్తున్న ఆదర్శ దంపతుల పేరు భార్గవ్, ఉమ.
దంపతులకు సంతానం కలిగితే ఏం ఆలోచిస్తారు ? ఆ బిడ్డ భవిష్యత్తు బాగుండాలని సేవింగ్స్ మొదలుపెట్టడం.. అన్ని అవసరాలను తీర్చేల ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం.. అందరి కన్నా ఆ బిడ్డ బాగా కనిపించాలని అధిక డబ్బులు ఖర్చు చేసి అన్ని వసతులు సమకూర్చడం.. తదితర వాటిపైనే సహజంగా అందరి ధ్యాస ఉంటుంది. కానీ నగరంలోని మియాపూర్కు చెందిన ఓ దంపతులు అలా ఆలోచించలేదు. వాళ్ల సేవింగ్ డబ్బులను ప్రస్తుత క్లిష్ట సమయాల్లో సామాజిక సేవకు వినియోగిస్తున్నారు. ఈవెంట్ ఆర్గనైజర్గా పనిజేస్తున్న భార్గవ్, ఉమలు తమకు వచ్చే సంపాదనలో రోజుకు రూ.15 వేలు వెచ్చించి పేదోడి కడుపు నింపుతున్నారు. ఆదా చేసుకోవడం కాదు.. అన్నం పెట్టడమే తమ కర్తవ్యంగా భావిస్తున్నారు. ఇంట్లోనే వారు స్వయంగా వండి ఆహార పాకెట్లలో నింపి.. అవసరమున్న వారికి పంపిస్తున్నారు. గత ఏడాది 35 వేల మందికి ఆహార పాకెట్లు పంపిణీ చేశారు.
అమ్మ, భార్య ప్రోత్సాహంతోనే..
అమ్మ రోజా సుందర వల్లి, భార్య ఉమల ప్రోత్సాహంతోనే అటు వ్యాపారం ఇటు సామాజిక సేవ సాధ్యం అవుతుంది. వారే స్వయంగా వండి ఆహార పాకెట్లు ప్యాక్ చేస్తారు. ఉదయం 6 గంటల నుంచే మధ్యాహ్నా భోజన ఏర్పాట్లు ప్రారంభిస్తాం. నా 4 నెలల బాబును చూసుకుంటూనే ఉమ నా లక్ష్యానికి అండగా నిలుస్తుంది. కొవిడ్ జాగ్రత్తలు తీసుకుని వంట చేస్తాం. మేమూ అదే తింటాం. ఫోన్ చేస్తే ప్రాధాన్యక్రమంలో పార్సిల్ పంపిస్తాం.
ఫోన్ చేస్తే ఇంటికే ఆహారం..
బాచుపల్లి, చందానగర్, అమీన్పుర్,కూకట్పల్లి, నిజాంపేట్, జేపీనగర్, శ్రీవాణినగర్, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో రోజూ సేవలు అందుబాటులో ఉన్నాయి. నగరంలోని ఇతర ప్రాంతాలకు మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో సేవలను విస్తృతం చేయనున్నారు. తమ స్నేహితులు, కొంతమంది డెలివరీ బాయ్స్ సాయంతో ఫుడ్ను చిరునామాలకు చేరుస్తున్నారు. 8886686000 నెంబర్కు ఫోన్ చేసి వివరాలు చెబితే ఆ లొకేషన్కు ఆహారం అందుతుంది. పప్పు, సాంబార్, ఒక కూర, రైస్, కర్డ్తో కూడిన మీల్స్ ఇంటికి చేరుతుంది.