సిటీబ్యూరో, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ):దసరాలోపు ఎస్టీపీల నిర్మాణం పూర్తవ్వాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ప్యాకేజీ 3లో చేపట్టబోయే ఫాక్స్ సాగర్ ఎస్టీపీ(14 ఎంఎల్డీలు), వెన్నెలగడ్డ ఎస్టీపీ(10 ఎంఎల్డీలు) ప్రాంతాలను జలమండలి ఎండీ దానకిశోర్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ హరీశ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందలతో కలిసి అర్వింద్కుమార్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులతో ఎస్టీపీలు నిర్మించేందుకు చేయాల్సిన ఏర్పాట్ల గురించి చర్చించారు. మురుగునీటి శుద్ధి జరిగితే చెరువు ఆవరణ ఆహ్లాదకరంగా మారుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఇప్పటి వరకు జరిగిన పనులు, చేపట్టబోయే వాటి గురించి ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పనులపై రూపొందించిన ప్రణాళికతో పాటు చేపట్టాల్సిన పనులకు సంబంధించిన ప్లాన్ మ్యాప్లను పరిశీలించారు.
నగరంతో పాటు శివారు మున్సిపాలిటీ ప్రాంతాల్లో.. సీవరేజీ మాస్టర్ ప్లాన్లో భాగంగా మురుగు నీటి శుద్ధి కేంద్రాలను(ఎస్టీపీ) నిర్మించాలని జలమండలి తలపెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం మూడు ప్యాకేజీల కింద నిత్యం 1257.50 ఎంఎల్డీలు (మిలియన్ లీటర్ పర్ డే) మురుగు నీటిని శుద్ధి చేయాలనే లక్ష్యంతో మొత్తం 31 మురుగునీటి శుద్ధి కేంద్రాలను (ఎస్టీపీ) జలమండలి నిర్మిస్తున్నది. తొలుత పెరుగుతున్న నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా నగరంలో కొత్తగా రూ. 1280.87 కోట్లతో కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి సర్కిల్ ప్రాంతాల్లో 376.5 ఎంఎల్డీల మురుగునీటిని శుద్ధి చేసే లక్ష్యంగా మొదటిదశగా జలమండలి 17 కొత్త ఎస్టీపీల నిర్మాణం చేపడుతున్నది.
ప్యాకేజీ-1లో అల్వాల్, మల్కాజ్ గిరి, కాప్రా, ఉప్పల్ సర్కిల్ ప్రాంతాల్లో.. రూ.1230.21 కోట్లతో 8 ఎస్టీపీలను ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా 402.50 ఎంఎల్డీల మురుగు నీటిని శుద్ధి చేస్తారు. ప్యాకేజీ-2 లో రాజేంద్రనగర్, ఎల్బీనగర్ సర్కిల్ ప్రాతాల్లో రూ.1355.33 కోట్లతో 6ఎస్టీపీలను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ 480.50 ఎమ్మెల్డీల మురుగు నీటిని శుద్ధి చేస్తారు. ఇక మిగిలిన ప్యాకేజీ-3లో కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి సర్కిల్ ప్రాంతాల్లో రూ.1280.87 కోట్లతో 17 ఎస్టీపీలను ఏర్పాటు చేసి, ఇక్కడ 376.5 ఎమ్మెల్డీల మురుగు నీటిని శుద్ధి చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్, జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. ఎం. సత్యనారాయణ, ప్రాజక్టు డైరెక్టర్ శ్రీధర్ బాబు, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ మమత, ఇంజినీరింగ్, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.