సిటీబ్యూరో, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీ చేపట్టే అభివృద్ధి పనుల వద్ద తాగునీటి పైపులైన్ పనులను త్వరగా పూర్తి చేయాలని జలమండలి ఎండీ దానకిశోర్ జలమండలి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో జలమండలి, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దానకిశోర్ మాట్లాడుతూ నగరంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎస్ఆర్డీపీ, ఆర్వోబీ (రోడ్డు ఆన్ బ్రిడ్జి), ఎఫ్వోబీ తదితర అభివృద్ధి పనులు జరుగుతున్న ప్రాంతంలో జలమండలి పైప్ లైన్ మళ్లింపు, విస్తరణ వంటి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. అవసరమైతే రెండు శాఖల అధికారులు సంయుక్తంగా ఈ పనులను సందర్శించి, సమన్వయంతో సాధ్యమైనంత తొందరగా పనులను పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జలమండలి డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, స్వామి, టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్, సీజీఎంలు, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.