సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లోని తాగునీటి రిజర్వాయర్ల వద్ద జలమండలి భద్రతను కట్టుదిట్టం చేసింది. రిజర్వాయర్ల వద్ద నిరంతరం పహారా ఉంచేందుకుగాను ప్రైవేటు ఏజెన్సీ ద్వారా కొత్తగా 100 మంది సెక్యూరిటీ గార్డులను నియమించింది. వీరంతా నగరంలోని వివిధ రిజర్వాయర్ల వద్ద 24గంటల పాటు విధులు నిర్వహించనున్నారు. జలమండలి విజిలెన్స్ విభాగంతో పాటు స్థానిక పోలీసుల సమన్వయంతో పని చేయనున్నారు. కొత్త సెక్యూరిటీ గార్డులకు శుక్రవారం ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా జలమండలి ఈడీ డా.ఎం.సత్యనారాయణ మాట్లాడుతూ రిజర్వాయర్ల వద్దకు బయటి వ్యక్తులను అనుమతించవద్దని సెక్యూరిటీ సిబ్బందికి సూచించారు. జలమండలి వినియోగదారులు, సాధారణ ప్రజలు ఏదైనా సమస్యలు ఉంటే పరిషరించుకోవడానికి ఆఫీసు సమయాల్లో అధికారులను కలిసే వెసులుబాటు ఉంటుందన్నారు. రిజర్వాయర్ల ప్రాంగణాల్లో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా నిత్యం జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. ఏవైనా సమస్యలుంటే వెంటనే జలమండలి విజిలెన్స్ విభాగానికి, స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఈడీ పేరొన్నారు.
రిజర్వాయర్ల వద్ద లాగ్ బుక్లను ఏర్పాటు చేయాలని, ఉద్యోగులతో పాటు అందరి వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. అనంతరం కొత్త సెక్యూరిటీ గార్డులు ఖైరతాబాద్ జలమండలి ప్రధాన కార్యాలయం ముందు మార్చ్ ఫాస్ట్ నిర్వహించి రిజర్వాయర్ల వద్ద విధుల్లో చేరారు. ఈ కార్యక్రమంలో ఆపరేషన్స్ డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ , స్వామి, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ రవిచంద్రా రెడ్డి, సీజీఎం విజయ రావు, ఎజైల్ సెక్యూరిటీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
సిటీబ్యూరో, డిసెంబర్ 10 ( నమస్తే తెలంగాణ ): వన్ రూపీ చాలెంజ్తో అనేక మంది నిరుపేదలకు చేయూతనిస్తున్నారు వాయిస్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు. ఒక్క రూపాయి ఇవ్వండి.. ఒక్క ఆలోచన ఇవ్వండి అంటూ దేశ ప్రగతికి కృషి చేస్తున్న ఈ సంస్థ శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలకు మాస్కులు పంపిణీ చేసింది. 2019 పాండమిక్ నుంచి వన్ రూపీ చాలెంజ్ ప్రారంభించి.. అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సంస్థ ప్రెసిడెంట్ పసుపులేటి శషాంక్ చెప్పారు.