మూడు దశల్లో క్లోరినేషన్ పూర్తయ్యాకే ప్రజలకు తాగునీటిని అందిస్తున్నామని, ముషీరాబాద్ రిసాలగడ్డ ట్యాంకు ఘటన అత్యంత దురదృష్టకరమని జలమండలి ఎండీ దానకిశోర్ విచారం వ్యక్తం చేశారు. ట్యాంకులో యువకుడి మృతదేహం లభించిన నేపథ్యంలో నగరవ్యాప్తంగా తాగునీటి రిజర్వాయర్లు, ట్యాంకుల వద్ద భద్రతపై గురువారం ఆయన ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. 278 రిజర్వాయర్ల వద్ద పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తామని, శుక్రవారం నుంచి 100 మంది సెక్యూరిటీగార్డులు విధులు నిర్వర్తిస్తారని, 200 మంది బోర్డు సిబ్బందికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. రిజర్వాయర్ల ప్రాంగణాలు, వాటర్ ట్యాంకుల వద్దకు ఇతరులు ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటామని, నెలరోజుల్లో 600కు పైగా సీసీ కెమెరాలు బిగించి స్థానిక పోలీస్స్టేషన్కు అనుసంధానించే విషయం ఈ శాఖతో చర్చిస్తామని ఎండీ తెలిపారు.
ముషీరాబాద్ పరిధిలోని రిసాల గడ్డ వాటర్ ట్యాంక్ వద్ద జరిగిన సంఘటన దురదృష్టకరమని జలమండలి ఎండీ దానకిశోర్ పేరొన్నారు. రిజర్వాయర్ల వద్ద భద్రతకు, ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించేందుకు జలమండలి అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అయినా ముషీరాబాద్లో ఇలాంటి ఘటన జరగడం విచారకరమని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు వందలాది రిజర్వాయర్లు, వాటర్ ట్యాంకుల ద్వారా ప్రజలకు జలమండలి మూడంచెల క్లోరినేషన్ ప్రక్రియతో నాణ్యమైన నీటిని సరఫరా చేస్తుందన్నారు. ఇప్పటికే జలమండలి రిజర్వాయర్ల వద్ద పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఉందని, దీన్ని మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రిజర్వాయర్లు, వాటర్ ట్యాంకుల వద్ద అవాంచనీయ ఘటనలు జరుగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నట్లు పేరొన్నారు. ఈ మేరకు గురువారం ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్లతో ఎండీ దానకిశోర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఇక మీదట నగరంలో రిసాల గడ్డ లాంటి ఘటనలు జరుగకుండా మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం ఉన్నట్లు ఎండీ దానకిశోర్ అభిప్రాయపడ్డారు. నగరంలో ఉన్న రిజర్వాయర్లు, వాటర్ ట్యాంకుల వద్ద మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆయన నిర్ణయించారు. ఇప్పటికే కోర్ సిటీలో 378 సర్వీస్ రిజర్వాయర్లు ఉండగా, దాదాపు 100 రిజర్వాయర్ల ప్రాంగణాల్లోనే కార్యాలయాలు ఉన్నాయని, వాటిలో ఇప్పటికే 24 గంటల భద్రత ఉందన్నారు. మిగతా 278 రిజర్వాయర్లకు ప్రస్తుతం పాక్షికంగా భద్రత ఉందని గుర్తించామని, వీటివద్ద 24 గంటల భద్రత ఏర్పాటు చేస్తామని ఎండీ తెలిపారు.
నగరంలోని రిజర్వాయర్ల ప్రాంగణాలకు, వాటర్ ట్యాంకుల వద్దకు ఇతరులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఎండీ దానకిశోర్ ఆదేశించారు. ఎలివేటెడ్ రిజర్వాయర్ల వద్ద పైకి వెళ్లే మెట్ల దగ్గర గేట్లు అమర్చి తాళం ఏర్పాటు చేసి బయటివారు రాకుండా చూడాలని సూచించారు. అన్ని రిజర్వాయర్ల ప్రాంగణాల బయట ఇతరులకు అనుమతి లేదని చెబుతూ నిషేధిత స్థలం అనే సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించా రు. రిజర్వాయర్లలోకి దిగడానికి ఏర్పాటు చేసిన మూ తలు, గేట్లకు తప్పనిసరిగా తాళాలు వేయాలని చెప్పారు.
రిజర్వాయర్ల వద్ద 24గంటల భద్రత కోసం మరో 100మంది ప్రైవేటు సెక్యూరిటీ గార్డులను గురువారం నుంచే నియమిస్తున్నట్లు ఎండీ చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే ఎజైల్ సంస్థకు టెండర్ ఖరారైందని తెలిపారు. వీరితో పాటు జలమండలిలోని వివిధ విభాగాల్లో సుమారు 200మంది అదనపు సిబ్బందిని గుర్తించి, వీరికి కూడా 15 రోజుల్లో రిజర్వాయర్ల ప్రాంగణాల్లో భద్రత పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిపారు. రిజర్వాయర్ల తనిఖీకి నాలుగు ఫ్లయింగ్ స్వాడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేరొన్నారు. ఈ ఫ్లయింగ్ స్వాడ్ను చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ రవిచంద్రా రెడ్డి పర్యవేక్షిస్తారని తెలిపారు. వీరు రాత్రి సమయాల్లో కూడా రిజర్వాయర్ ప్రాంగణాల్లో రక్షణ చర్యలను తనిఖీ చేస్తారని వివరించారు.
రాబోయే 3 రోజుల పాటు సీజీఎంలు, జీఎంలు, విజిలెన్స్ అధికారుల ఆధ్వర్యంలో 21 బృందాలుగా ఏర్పడి అన్ని రిజర్వాయర్లు, వాటర్ ట్యాంకుల వద్ద సెక్యూరిటీ ఆడిట్ చేయనున్నట్లు తెలిపారు. రిజర్వాయర్ల ప్రాంగణాల్లో చేపట్టాల్సిన రక్షణ చర్యలపై సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు. ఈ నివేదికలను పరిశీలించిన అనంతరం అవసరమైన మరిన్ని భద్రతా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈడీ ఎం.సత్యనారాయణ , టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్, ఆపరేషన్ డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, స్వామి, సీఈవో రవిచంద్రా రెడ్డి, సీజీఎంలు, తదితరులు పాల్గొన్నారు.
నెల రోజుల్లో అన్ని రిజర్వాయర్ల ప్రాంగణాల్లో 600 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించడానికి ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఈ సీసీ కెమెరాలను స్థానిక పోలీస్ స్టేషన్లకు అనుసంధానం చేసే విషయంపై పోలీస్ శాఖతో సంప్రదిస్తామని చెప్పారు.