సిటీబ్యూరో, జనవరి 20(నమస్తే తెలంగాణ): అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ కొరడా ఝళిపిస్తోంది. ఈ నేపథ్యంలో చర్యల పరంపర కొనసాగుతున్నది. మున్సిపల్ చట్టం పరిధికి లోబడి అక్రమ నిర్మాణాలపై జిల్లా టాస్ ఫోర్స్ బృందాలు, హెచ్ఎండీఏ ప్లానింగ్ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ యంత్రాంగం సంయుక్తంగా నిర్వహిస్తున్న కూల్చివేత చర్యల్లో భాగంగా గురువారం నాల్గవ రోజు ఐదు మున్సిపాలిటీల పరిధిలో పన్నెండు పెద్ద అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నారు. కొంపల్లి, తుర యంజాల్, నార్సింగి, శంషాబాద్, కొత్తూరు మున్సిపాలిటీల పరిధిలో డిస్ట్రిక్ట్ టాస్ఫోర్స్, హెచ్ఎండీఏ బృందాలు గురువారం విధులను నిర్వహించాయి. కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఐదు, నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో మూడు, తుర యంజాల్ మున్సిపాలిటీ పరిధిలో రెండు, శంషాబాద్, కొత్తూరు మున్సిపాలిటీల పరిధిలో ఒకటి చొప్పున కలిపి పన్నెండు అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. నిర్దిష్టమైన అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలు, గోదాములు వంటి అక్రమ నిర్మాణాలపై కూల్చివేత చర్యలు కొనసాగుతున్నాయని, నాలుగు రోజుల్లో 45 అక్రమ నిర్మాణాలను డిస్ట్రిక్ట్ టాస్క్ఫోర్స్ బృందాలు కూల్చివేసినట్లు అధికారులు పేర్కొన్నారు.