సికింద్రాబాద్/మారేడ్పల్లి, జనవరి 16: దేశంలోనే ప్రసిద్ధి చెందిన సికింద్రాబాద్ క్లబ్లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుమారు రూ.20 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్టు క్లబ్ నిర్వాహకులు చెప్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో క్లబ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనాన్ని ఎక్కువ భాగం కట్టెతోనే నిర్మించడంతో మంటలు వేగంగా వ్యాప్తి చెంది, పూర్తిగా దగ్ధమైంది. సంక్రాంతి సెలవు దినం కావడం, ఆ సమయంలో క్లబ్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.
పది అగ్నిమాపక యంత్రాలు వచ్చినప్పటికీ మంటలను అదుపులోకి తేవడానికి మూడు గంటలకు పైగానే పట్టింది. మొదట అంతస్థు నుంచి రెండో అంతస్థుకు వెళ్లేందుకు లోపలి భాగంలో ఉన్న కట్టెల మెట్లు పూర్తిగా దగ్ధమవ్వడంతో మంటలను అదుపులోకి తేవడానికి ఎక్కువ శ్రమించాల్సి వచ్చిందని జిల్లా అగ్నిమాపక అధికారి మధుసూదన్రావు పేర్కొన్నారు. అగ్నిప్రమాదంపై మారేడ్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు.
బ్రిటిష్ హయాంలో నిర్మాణం
అత్యంత పురాతన సికింద్రాబాద్ క్లబ్ను 1878 బ్రిటిష్ హయాంలో నిర్మించారు. దాదాపు 24 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్లబ్లో దాదాపు నాలుగు వేల మందికి సభ్యత్వం ఉన్నది. సుమారు 300 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. సభ్యత్వ రుసుం సుమారు రూ.15 లక్షల వరకు ఉంటుంది. దీనిని భారతీయ వారసత్వ సంపదగా గుర్తించడంతోపాటు 2017లో పోస్టల్ కవర్ను విడుదల చేశారు.