హైదరాబాద్ : న్యాయవాది దంపతులు వామన్రావు, నాగమణి దంపతుల హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. న్యాయవాది దంపతుల హత్య కేసును హైకోర్టు నేరుగా పర్యవేక్షిస్తోందని సీజే ధర్మాసనం తెలిపింది. వామన్ రావు తండ్రికి ఎంత బాధ ఉందో.. కోర్టుకు కూడా అంతే ఉందని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసు దర్యాప్తు సక్రమంగానే కొనసాగుతోందన్నారు. ఇప్పుడు సీబీఐకి అప్పగిస్తే సమయం వృథానేనని కోర్టు అభిప్రాయపడింది.
నివేదిక సమర్పించిన ఏజీ
వామన్ రావు, నాగమణి హత్యల దర్యాప్తుపై అడ్వకేట్ జనరల్ కోర్టుకు నివేదిక సమర్పించారు. నిందితులు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని, ఇప్పటి వరకు 25 మంది సాక్షులను విచారించామని పోలీసులు కోర్టుకు తెలిపారు. కుంట శీను, చిరంజీవి, కుమార్ వాంగ్మూలాలను మెజిస్ర్టేట్ ఎదుట నమోదు చేశామన్నారు. బిట్టు శీను, లచ్చయ్య వాంగ్మూలాల నమోదు కోసం కోర్టులో దరఖాస్తు చేశామని పోలీసులు తెలిపారు. కుంట శీను, చిరంజీవిలను సాక్షులు గుర్తించే ప్రక్రియ పూర్తి చేశామన్నారు. సీసీటీవీ, మొబైల్ దృశ్యాలను ఎఫ్ఎస్ఎల్కి పంపించామన్నారు. నిందితులు ఉపయోగించిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
ప్రత్యక్ష సాక్షులకు పోలీసు భద్రత
ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులకు పోలీసు భద్రత కల్పించామని పోలీసులు కోర్టుకు తెలిపారు. కొందరు సాక్షులు పోలీసు భద్రతను నిరాకరించారని చెప్పారు. మూడు ఆర్టీసీ బస్సుల్లోని ప్రయాణికులను గుర్తిస్తున్నామని పేర్కొన్నారు. బస్సు డ్రైవర్, కండక్టర్లు, ముగ్గురు ప్రయాణికుల వాంగ్మూలాలు మెజిస్ర్టేట్ ఎదుట నమోదు చేశామన్నారు. ఈ హత్య కేసులో ఏడో నిందితుడిని కూడా చేర్చి అరెస్టు చేశామని తెలిపారు. తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది.