హైదరాబాద్ : కొలంబియాకు చెందిన ప్రతినిధుల బృందం హైదరాబాద్ను సందర్శించింది. ఆరోగ్యశాఖ మంత్రి ఫెర్నాండో రూయిజ్ గోమెజ్ నేతృత్వంలోని 34 మంది సభ్యుల ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం తెలంగాణలో లైఫ్ సైన్సెస్ సెక్టార్లో విజయాలను అధ్యయనం చేసేందుకు రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా జీనోమ్ వ్యాలీతో సహా లైఫ్ సైన్సెస్ క్లస్టర్లను, సీసీఎంబీ, ఐఐసీటీలను సందర్శించి, జీవశాస్త్రాలరంగాల పనితీరును ఉన్నత స్థాయి ప్రతినిధులు పరిశీలించారు. అనంతరం తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా జీవశాస్త్రాల రంగంలో ప్రభుత్వం చర్యలను బృందం ప్రశంసించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కొలంబియాలో ఎకోసిస్టం అభివృద్ధికి హైదరాబాద్ రావడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలకు ఇదో గొప్ప అంతర్జాతీయ గుర్తింపని పేర్కొన్నారు.