హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): చెదురుమదురు ఘటనలు మినహా తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈవీఎంలలో నిక్షిప్తమైన 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం ఈనెల 3న తేలిపోనుంది. ఆ రోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అదే రోజు మధ్యాహ్నానానికి గెలుపోటములపై స్పష్టత రానుండగా, సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈసారి అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోరు హోరాహోరీగా సాగటంతో ఓటరు తీర్పు ఎలా ఉండబోతుందన్న దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభమై సాయంత్రం ఐదు గంటలకే ముగియగా, అప్పటి వరకు క్యూలో ఉన్న వారిని కూడా అనుమతించటంతో కొన్నిచోట్ల పొద్దుపోయే వరకు పోలింగ్ కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, సుమారు రెండున్నర లక్షలమంది సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను బరిలోకి దింపగా, ఈసారి స్వతంత్రులు కూడా భారీగానే రంగంలోకి దిగారు.
3న జరగనున్న ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. మొత్తం 49 ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసింది.119 నియోజకవర్గాలకు గాను 119 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఎక్కువ పోలింగ్ కేంద్రాలున్న పది నియోజకవర్గాలు మినహా ఒక్కో నియోజకవర్గంలో 14+1 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. కూకట్పల్లి, ఉప్పల్, మల్కాజ్గిరి, పటాన్చెరు తదితర నాలుగు నియోజకవర్గాల్లో 400లకుపైగా పోలింగ్ కేంద్రాలు ఉండటంతో ఈ నియోజకవర్గాల్లో 20+1 టేబుళ్లు.. రాజేంద్రనగర్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం, కూకట్పల్లి, మేడ్చల్ తదితర ఆరు నియోజకవర్గాల్లో 500లకుపైగా పోలింగ్ కేంద్రాలు ఉండటంతో 28+1 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. లెక్కింపులో జాప్యం జరగకుండా ఉండేందుకే ఈ ఏర్పాట్లు. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు నవంబర్ 3న షెడ్యూల్ విడుదల కాగా, 28న ప్రచారానికి తెరపడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇవి మూడో ఎన్నికలు. గత రెండు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అద్వితీయ మెజార్టీతో విజయం సాధించింది. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేస్తామన్న ధీమాతో ఉంది.
ఎన్నికల ఫలితాలపై రాజకీయ పార్టీలు, అభ్యర్థులతోపాటు ప్రజల్లోనూ తీరని ఉత్కంఠ నెలకొన్నది. గతంలో వచ్చిన సర్వేలు, పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల మధ్య పొంతన లేకుండా ఉండటంతో ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ మొదలైంది. చాలా నియోజకవర్గాల్లో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ద్విముఖ పోటీ నెలకొనగా, కొన్నిచోట్ల బీజేపీ కూడా బలంగా ఉండటంతో త్రిముఖ పోటీ ఉంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాత్రం వేటికవే గెలుపుపై ధీమాగా ఉన్నాయి.
ఈసారి పోస్టల్ బ్యాలెట్లకు ప్రత్యేకంగా టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. 500 ఓట్లకు ఒకటి చొప్పున టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈవీఎంల కౌంటింగ్ పూర్తయ్యేలోపు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తిచేయాలని నిర్ణయించారు. ఒకవేళ ఈవీఎంల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేలోగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తికాకుంటే, చివరి రౌండ్ ఈవీఎంల లెక్కింపును నిలిపేసి పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాతే చివరి రౌండ్ ఈవీఎంల లెక్కింపు చేపట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈసారి 119 నియోజకవర్గాలకుగాను దాదాపు రెండున్నర లక్షల పోస్టల్ బ్యాలెట్లు జారీచేశారు.