హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్వాసుల దాహార్తి తీర్చే ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జంట జలాశయాల పరిరక్షణ కోసం ఉద్దేశించిన జీవో 111 రద్దు అయ్యిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు రాష్ట్ర ప్రభుత్వం కళ్లెం వేసింది. జీవో 111లో పేర్కొన్న ఆంక్షలు, నిషేధాజ్ఞలు అమల్లోనే ఉన్నాయని హైకోర్టుకు తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ 21న జీవో 69ని జారీ చేశామని, దీని ప్రకారం 1996 నాటి జీవో 111 రద్దు కాలేదని పేర్కొంటూ విపక్షాల విమర్శలకు చెక్ పెట్టింది.
జంట జలాశయాల పరీవాహక ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేస్తున్నదని, ఆ జలాశయాల రక్షణ బాధ్యతల నుంచి ప్రభుత్వం పూర్తిగా తప్పుకొంటున్నదనే విమర్శల్లో వాస్తవం లేదని స్పష్టం చేస్తూ హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. హుస్సేన్సాగర్ మాదిరిగా జంట జలాశయాల్లో నీరు కలుషితం అవుతున్నదనే ఆందోళన అక్కరలేదని చెప్పకనే చెప్పింది.
ప్రభుత్వం ఏకపక్షంగా, ఆషామాషీగా ఏమీ చేయడం లేదని, జీవో 111 విషయంలో శాస్త్రీయంగా అన్ని కోణాల్లో అధ్యయనం చేసే నిమిత్తం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్టు హైకోర్టుకు తెలియజేసింది. అనేక కోణాల్లో కమిటీ కసరత్తు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని, అప్పటివరకు జీవో 111 అమల్లోనే ఉంటుందని వివరిస్తూ ప్రభుత్వం తరఫున మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ హైకోర్టుకు నివేదించారు. దీని ప్రకారం.. కొత్త జీవో 69 వెలువడినప్పటికీ, జంట జలాశయాల పరీవాహక ప్రాంతాల్లో పాత జీవో 111లోని నిషేధాజ్ఞలు అమల్లోనే ఉంటాయి. రెండు జలాశయాల ఎఫ్టీఎల్కు పది కిలోమీటర్ల పరిధిలోని 84 గ్రామాలకు వర్తించే ఆంక్షలన్నీ కొనసాగుతాయి.
ఒకప్పుడు జంట జలాశయాల నుంచి హైదరాబాద్ నగర ప్రజలకు 27.59% తాగు నీటిని అందించేవారు. అప్పుడు హైదరాబాద్ ప్రజల నీటి వినియోగం 145 ఎంజీడీ ఉండేది. ఇప్పుడు 602 ఎంజీడీలకు పెరిగింది. ఇప్పుడు జంట జలాశయాల నుంచి 1.20 శాతమే అందిస్తున్నారు. భవిష్యత్తులో వీటిపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో కొత్త జీవో 69 జారీ చేయాల్సి వచ్చింది. జలాశయాల నీరు కలుషితం కాకుండా అన్ని చర్యలు తీసుకుని వాటిని రక్షించాలనే సంకల్పంతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదికపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొనే వరకు జీవో 111 ప్రకారం నిషేధాజ్ఞలు అమల్లోనే ఉంటాయని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. ప్రభుత్వం తీసుకొన్న చర్యల కారణంగా జీవో 111 సరిగ్గా అమలు కావడం లేదని పర్యావరణవేత్త జీవానందరెడ్డి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని కొట్టేయాలని ప్రభుత్వం కోరింది. ఈ పిల్ను హైకోర్టు విచారించనున్నది.
ఉన్నతస్థాయి కమిటీ పలు అంశాలపై శాస్త్రీయంగా అన్ని కోణాల్లో అధ్యయనం చేసి నివేదిక ఇస్తుంది. రెండు జలాశయాల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, వ్యర్థాలు, మురుగు, వినియోగ నీరు జలాశయాల్లోకి చేరకుండా తీసుకోవాల్సిన చర్యలు, మురుగు నీరు మళ్లింపునకు ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థ, గ్రీన్జోన్ల ఏర్పాటు, సీవరేజ్ ప్లాంట్ల ఏర్పాటు, చుట్టుపకల ఏవిధంగా ఉండాలనే పరిపాలనాపరమైన అంశాలతో పాటు లే అవుట్లు, కొత్త నిర్మాణాలకు ఏ విధంగా, ఏమేరకు అనుమతులు ఇవ్వాలి? రెండు జలాశయాల్లో నీరు కలుషితం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? భారీ వర్షాలు, వరదలు సంభవిస్తే పరీవాహక ప్రాంతాలు దెబ్బతినకుండా తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై కమిటీ నివేదిక ఇస్తుంది.