అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సినీ నటుడు నాగార్జున భేటీ అయ్యారు. గురువారం ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం అనంతరం పలువురు నిర్మాతలతో కలిసి సీఎంను కలిశారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా భేటీలో పలు అంశాలను ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది. ఇవాళ కేబినెట్లో సినిమాటోగ్రఫీ చట్ట సవరణ ఆర్డినెన్స్కు ఆమోదం తెలిపిన తెలిపింది. ఈ క్రమంలో సీఎం జగన్తో నాగార్జున భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులు, టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు తదితర అంశాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. భేటీ తర్వాత నాగార్జున సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘జగన్ నా శ్రేయోభిలాషి. ఆయనను చూసి చాలా రోజులవుతోంది. అందుకే విజయవాడకు వచ్చా. సీఎం జగన్తో కలిసి లంచ్ చేశా. విజయవాడ రావడం నాకు ఆనందంగా ఉంది’ అని అన్నారు. ఆయన వెంట నిర్మాతలు ప్రీతంరెడ్డి, నిరంజన్రెడ్డి ఉన్నారు.