న్యూఢిల్లీ, మార్చి 29: హీరో మోటోకార్ప్ తన ఖాతా పుస్తకాల్లో రూ. 1,000 కోట్లకుపైగా బోగస్ ఖర్చుల్ని ఆదాయపు పన్ను శాఖ (ఐటీ శాఖ) కనుగొన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. మార్చి 23నుంచి 26 వరకూ ఢిల్లీ ఎన్సీఆర్ పరిసర ప్రాంతాల్లోని హీరో మోటోకార్ప్ కార్యలయాలు, ఆ సంస్థ సీఎండీ పవన్ ముంజాల్ ఇండ్లపై ఐటీ శాఖ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. దాదాపు 40 ఆవరణల్లో ఈ సోదాలు జరిగాయి. హీరో గ్రూప్ బోగస్ కొనుగోళ్లు జరిపినట్లు దాడుల్లో లభించిన డాక్యుమెంట్లు, డిజిటల్ డాటా ద్వారా వెల్లడయ్యిందని, రూ. 1,000 కోట్లకుపైగా నకిలీ నగదు వ్యయాలకు సంబంధించి ఖాతాల్లో ఎంట్రీలు వేసినట్టు ఆధారాలు లభించాయని ఆ వర్గాలు వివరించాయి. అలాగే ఢిల్లీ శివారు ప్రాంతంలో ఫామ్ హవుస్ కొనుగోలుకు రూ. 100 కోట్ల నగదు లావాదేవీని కనుగొన్నామని, పన్నును ఆదా చేసుకునేందుకు ఆ ఫామ్ హవుస్ మార్కెట్ ధరను తప్పుగా చూపించి, రూ.100 కోట్లకు మించి నల్లధనాన్ని ముంజాల్ చెల్లించారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తద్వారా ఐటీ చట్టం సెక్షన్ 269ఎస్ఎస్ను ఉల్లంఘించినట్లు తెలిపాయి. ఈ వార్తల నేపథ్యంలో హీరో మోటోకార్ప్ షేరు మంగళవారం బీఎస్ఈలో 7 శాతం పతనమై రూ. 2,208 వద్ద ముగిసింది.