తొలి పోరులో చెన్నై, కోల్కతా ఢీ
ముంబై: అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కారణంగా గత రెండేండ్లుగా యూఏఈ వేదికగా (2021 సీజన్లో సగం మ్యాచ్లు భారత్లో జరిగాయి) సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. ఈ సారి సొంత ప్రేక్షకుల మధ్య జరుగనుంది. రెండు నెలల పాటు అభిమానులను ఉర్రూతలూగించనున్న ఐపీఎల్ 15వ సీజన్కు శనివారం తెరలేవనుంది. లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ రాకతో జట్ల సంఖ్య పదికి చేరగా.. టెన్నిస్ తరహాలో తొలిసారి సీడింగ్ పద్ధతిలో రెండు గ్రూప్లుగా లీగ్ జరుగనుంది. సీజన్ ఆరంభ పోరులో గతేడాది ఫైనలిస్ట్లు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తలపడనున్నాయి. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న ధోనీ తొలిసారి కేవలం ప్లేయర్గా మైదానంలో అడుగు పెట్టనుండగా.. మహీ సలహాలతో స్టార్ ఆల్రౌండర్ జడేజా జట్టును ముందుకు నడుపనున్నాడు. లీగ్లో ఇప్పటి వరకు ఆడిన 12 సీజన్లలో తొమ్మిదిసార్లు ఫైనల్కు చేరి నాలుగు సార్లు చాంపియన్గా నిలిచిన చెన్నై పాంచ్ పటాకా మోగించాలని చూస్తుంటే.. కొత్త కెప్టెన్ అయ్యర్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న కోల్కతా ‘తీన్మార్’ ఆడేందుకు తహతహలాడుతున్నది.
చెన్నై సూపర్ కింగ్స్కే మొగ్గు
తొలి పోరులో తలపడే ఇరు జట్లలో చెన్నై వైపే మొగ్గు కనిపిస్తున్నది. గత సీజన్లో అద్వితీయ ప్రదర్శనతో విజేతగా నిలిచిన చెన్నై తాజా సీజన్ కోసం మెరుగ్గా సిద్ధమైంది. లీగ్ ఆరంభానికి దాదాపు నెల రోజుల ముందే ప్రధాన ఆటగాళ్లు ప్రాక్టీస్ ప్రారంభించగా.. వాంఖడే వేదికగా బోణీ కొట్టాలని జడ్డూ సేన యోచిస్తున్నది. రుతురాజ్, మోయిన్ అలీ, రాయుడు, ధోనీ, బ్రావో, శివమ్ దూబే, జోర్డన్, శాంట్నర్తో చెన్నై జట్టు పటిష్టంగా కనిపిస్తున్నది. ఎలాంటి ఆటగాడి నుంచైనా అద్భుత ప్రదర్శన రాబట్టుకోగలిగే ధోనీ వంటి మాస్టర్ మైండ్ ఉండటం చెన్నైకి కొండంత అండ కానుంది. మరోవైపు శ్రేయస్ సారథ్యంలోని కోల్కతా కొత్తగా కనిపిస్తున్నది. ఫించ్, నరైన్, కమిన్స్, రస్సెల్ వంటి విదేశీ స్టార్లతో పాటు కోల్కతాకు కలిసి రానుంది.
కరోనా కారణంగా గత రెండేండ్లుగా యూఏఈలో సాగిన ఐపీఎల్..
ఈసారి స్వదేశంలో అభిమానులను అలరించేందుకు రెడీ అయింది!
వైరస్ ముప్పు తొలిగినా.. భయాలు ఇంకా వీడకపోవడంతో.. 25 శాతం మంది ప్రేక్షకులను అనుమతిస్తూ.. బయోబబుల్లో మ్యాచ్లను నిర్వహించేందుకు పాలక మండలి సమాయత్తమైంది!
మూడు వేదికలు.. పది జట్లు, 65 రోజులు.. 74 మ్యాచ్లతో..క్రీడాభిమానులను ఉర్రూతలూగించనున్న ఐపీఎల్ 15వ సీజన్కు రంగం సిద్ధమైంది!
మెగా వేలంతో జట్లు కొత్త రూపు సంతరించుకోగా.. రెండు నయా టీమ్ల రాకతో లీగ్లో జట్ల సంఖ్య 10కి పెరిగింది!
విరాట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోనీ తామంతట తామే కెప్టెన్సీకి వీడ్కోలు పలకగా..గతేడాది ఫైనల్కు చేర్చిన మోర్గాన్ను కోల్కతా కనీసం పట్టించుకోలేదు!
భారత జట్టులో చోటు కోసం తీవ్రంగా శ్రమిస్తున్న హార్దిక్ పాండ్యా గుజరాత్ను గైడ్ చేయనుండగా..పంజాబ్కు కెప్టెన్సీ వహించిన కేఎల్ రాహుల్ లక్నోను లీడ్ చేయనున్నాడు!
ముంబైని రోహిత్, ఢిల్లీని పంత్, రాజస్థాన్ను శాంసన్, హైదరాబాద్ను విలియమ్సన్ లాంటి పాత సారథులు ముందుకు నడపనుండగా..కొత్తగా చెన్నైకి జడేజా, బెంగళూరుకు డుప్లెసిస్, కోల్కతాకు శ్రేయస్, పంజాబ్కు మయాంక్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు!
జట్ల సంఖ్య ఎనిమిది నుంచి పదికి పెరగడంతో.. గతంలో మాదిరిగా ఒక్కో జట్టు మరో జట్టుతో రెండేసి మ్యాచ్లు కాకుండా.. గ్రూప్ల విధానంలో తలపడనున్నాయి. టెన్నిస్ తరహాలో తొలిసారి సీడింగ్ పద్ధతిలో ఒక్కో జట్టు 14 మ్యాచ్లు ఆడనుంది!!