హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో కాంస్యం పతకం సాధించిన తనను ట్రాన్స్జెండర్ అంటూ తన టీమ్ మేట్ స్వప్న బర్మన్ చేసిన సంచలన కామెంట్స్పై తెలంగాణ హెప్టాథ్లెట్ నందిని అగసారా మండిపడింది. తాను ట్రాన్స్జెండర్ను అని రుజువులు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించింది. రుజువుల ఉంటే చూపించాలని డిమాండ్ చేసింది. కాంస్యం సాధించిన సంతోషంలో ఉన్న తనపై సొంత టీమ్ మేటే ఇలాంటి ఆరోపణలు చేయడం నిరుత్సాహపర్చిందని తెలిపింది.
‘నేనేంటో నాకు తెలుసు. ఆమె దగ్గర ఏమైనా రుజువులు ఉంటే చూపించాలి. నేను కూడా దేశం కోసం సాధించిన పతకాన్ని చూపిస్తా. నేను దేశానికి మంచి పేరు తేవాలని మాత్రమే అనుకుంటున్నాను. మనం పతకం గెలిచాం. ప్రజలు దాని గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. బర్మన్ ఆరోపణలపై నేను అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (AFI)’ కు ఫిర్యాదు చేస్తా. వాస్తవానికి పతకం గెలిచిన సందర్భాన్ని ఎంజాయ్ చేద్దామనుకున్నా. కానీ, నా తల్లి ఆరోగ్యం బాగా లేకపోవడంతో భారత్కు తిరిగి వెళ్తున్నా’ అని అగసారా పేర్కొన్నారు.
కాగా, సోమవారం జరిగిన మహిళల హెప్లాథ్లాన్ ఫైనల్లో తెలంగాణకు చెందిన హెప్టాథ్లెట్ నందిని అగసారా 5712 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం దక్కించుకుంది. పశ్చిమబెంగాల్కు చెందిన మరో హెప్టాథ్లెట్ స్వప్న బర్మన్ 5708 పాయింట్లతో నాలుగో స్థానానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో తనకు రావాల్సిన కాంస్య పతకాన్ని ఓ ట్రాన్స్జెండర్కు వదులుకోవాల్సి వచ్చిందని బర్మన్ సంచలన
కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ను అగసారా తీవ్రంగా ఖండించింది.