మియాపూర్: పేదరికంతో ఏ విద్యార్థి చదువుకు దూరం కాకుడన్నదే తన తపనని అలాంటి పేద విద్యార్థులకు తాను పెద్దన్నలా అండగా నిలిచి వారి కలలను పూర్తి చేసుకునేందుకు సహకరిస్తానని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. తన నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే ఎందరో పేద విద్యార్థుల చదువుకు తోచిన సహాయాన్ని అందిస్తూ వారి బంగారు భవిష్యత్కు బాటలు వేసుకునేందుకు దోహదపడుతున్నట్లు వెల్లడించారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ ప్రేమ్నగర్ బి బ్లాక్కు చెందిన నిరుపేద విద్యార్థి సుమంత్ కు ఇంజనీరింగ్ విద్యకు కళశాల ఫీజు నిమిత్తం రూ.1,25,600 మొత్తాన్ని చెక్కు రూపంలో విప్ గాంధీ సోమవారం తన నివాసంలో అందించారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ ఆకస్మికంగా కుటుంబ పెద్ద పోవటంతో ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకుని చదివిస్తున్నట్లు , వారితో పాటు వారి కుమారుడికి ఫీజు చెల్లిస్తున్నా నన్నారు.
దాతల సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కష్టపడి చదివి ఉన్నత స్థానాలను అందుకోవాలని, భవిష్యత్లో తోచిన మేర పేదలకు అండగా నిలవాలని విప్ పిలుపునిచ్చారు. తన పరిధిలో పేద విద్యార్థులెవరినీ ఆర్థిక సమస్యతో చదువుకు దూరం కానివ్వబోనని ఆయన హామీ ఇచ్చారు. కాగా తన చదువుకు ఫీజు రూపంలో ఆర్థిక సాయం అందించిన విప్ గాంధీకి పేద విద్యార్థి సుమంత్ కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
సీఎం సహాయ నిధి అందజేత…
ఆల్విన్ కాలనీ డివిజన్ ఫేజ్ 2 కు చెందిన సలోమికి దవాఖానా ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి పథకం కింద మంజూరైన రూ. 2లక్షల ఆర్థిక సాయానికి సంబంధించిన మంజురు పత్రాన్ని విప్ గాంధీ సోమవారం తన నివాసంలో బాధిత కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం సహాయ నిధి పేదలకు కొండంత అండగా నిలుస్తున్నదన్నారు. పేద ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.