హైదరాబాద్ : తెలంగాణలో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. రాగల రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదవుతుందని, రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. ఇదిలా ఉండగా.. ఇవాళ ఉదయం 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి జల్లులు కురిశాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసింది.