పథనంతిట్ట/ఇడుక్కి : కేరళలో శనివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కేరళలోని ఎర్నాకులం, ఇడుక్కి, త్రిసూర్ జిల్లాలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రెడ్ అలర్ట్ జారీ చేసింది. పలు డ్యాముల్లో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం పినరాయి విజయన్ సూచించారు. భారీ వర్షాలతో నాలుగు రోజుల పాటు శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యను పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పంపా నదిలో నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నందున పుణ్య స్నానాలను తాత్కాలికంగా నిలిపివేసింది. అయ్యప్ప భక్తుల తాకిడిని తగ్గించేందుకు స్పాట్ బుకింగ్ను ప్రస్తుతానికి నిలిపేయాలని, వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా బుక్ చేసుకున్న వారి తేదీలను మార్చేందుకు కూడా పరిశీలిస్తున్నామని సీఎం తెలిపారు.