నమస్తే నెట్వర్క్, జూలై 31 : మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు నదులు.. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అన్నారం బ్యారేజ్ నిండుకుండలా కనిపిస్తున్నది. వార్ధా నది, పెన్గంగ నదులు తోడై వేమనపల్లి సరిహద్దులోని ప్రాణహిత నది ఉగ్రరూపం దాల్చింది. నీల్వాయి ప్రాజెక్టు నిండు కుండలా మారింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలోని ఎర్రవాగు,పెద్దవాగు పరీవాహక గ్రామాలు వాగుల బ్యాక్ వాటర్తో పంటలు నీట మునిగాయి. ప్రధానంగా పత్తి పంటకు నష్టం జరిగింది. సిర్పూర్(టీ) మండలం వెంకట్రావ్పేట సమీపంలోని పెన్గంగ ఉప్పొంగడంతో కలెక్టర్ హరిత పరిశీలించారు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 18వ డివిజన్ (గుడిపేట) శివారులోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. హైదరాబాద్కు తాగునీటి అవసరాల కోసం 308 క్యూ సెక్కులను తరలిస్తుండగా, నంది పంపు హౌస్ నుంచి 15,750 క్యూ సెక్కుల నీటిని ఎత్తి పోస్తున్నారు. 5 గేట్లను ఎత్తి 26,790 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని పెన్గంగ, గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహించాయి. తలమడుగు మండలంలో ఉమ్రి, కప్పర్దేవి, కోసాయి, దేగామ, తదితర గ్రామాల్లో 650 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని ఏవో ప్రమోద్రెడ్డి తెలిపారు. భోరజ్ మండలంలోని చనాక-కొరాట బ్యారేజీ పూర్తిస్థాయి నీటి మట్టం 213 మీటర్లకు చేరుకున్నది. కుంటాల, పొచ్చెర, కనకాయి జలపాతాలు ఉప్పొంగి ప్రవహించాయి. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు వద్ద పరిస్థితిని కలెక్టర్ భవేశ్ మిశ్రా పరిశీలించారు. నవాబ్పేట్లో పశువుల కాపరి గల్లంతయ్యాడు.