శ్రీశైలం : కృష్ణానది పరవళ్లు తొక్కుతున్నది. భారీ వానలు, వరదలతో కృష్ణానదిపై అన్ని జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. శ్రీశైలం జలాశయానికి 4,36,896 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. పది గేట్లను ఎత్తివేసి అధికారులు 4,47,896 క్యూసెక్కుల వరదను దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకుగాను 884.40 అడుగులు, గరిష్ఠస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలకు గాను 212.4385 నీరు నిల్వ ఉన్నది. కుడి, ఎడమగట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది.
ఏపీ పవర్ హౌస్ నుంచి 29,200, తెలంగాణ పవర్ హౌస్ నుంచి 33,921 క్యూసెక్కులు, స్పిల్వే నుంచి 3,67,225 క్యూసెక్కుల నీరు విడుదలవుతున్నది. మరో వైపు నాగార్జున సాగర్కు 3.69లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నది. 26 గేట్లను ఎత్తివేసి 3.17లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. 18గేట్లను పది అడుగులు, ఎనిమిదిగేట్లను ఐదు అడుగుల మేర ఎత్తివేశారు. డ్యామ్ పూర్తిస్థాయినీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 586 అడుగులు. పూర్తిస్థాయి నిల్వసామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. 300 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. ప్రాజెక్టు నుంచి మొత్తం 3.69లక్షల క్యూసెక్కుల నీరు విడుదలవుతున్నది.