హైదరాబాద్, మార్చి 31(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎండలు తీవ్రమవుతున్నాయి. ఉదయం నుంచే వేడిగాలులు వీస్తున్నాయి. శుక్ర, శనివారాల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం తెలిపింది. చాలా ప్రాంతాల్లో సాధారణం కన్నా ఎక్కువగా 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు న మోదయ్యే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఉత్తర తెలంగాణలో సాధారణం కన్నా తక్కువగా, దక్షిణ తెలంగాణలో సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. గురువారం రాష్ట్రం లో అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి, ఆదిలాబాద్ జిల్లా చేప్రాలలో 43.8 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. ఉపరితల ద్రోణి గురువారం ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా ఇంటీరియర్ తమిళనాడు వరకు సముద్రమట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని పేర్కొన్నది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఎండలు తీవ్రమై గాలిలో తేమ 51 శాతానికి తగ్గిందని వాతావరణ కేంద్రం తెలిపింది. గాలిలో తేమ శాతం తగ్గడంతో పొడిగాలులు వీస్తున్నాయని వివరించింది. ఈ నెలలో ఎండలు అధికంగానే ఉంటాయని, చెడుగొట్టు వానలు అదేస్థాయిలో ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
రాష్ట్రంలో శుక్ర,శనివారాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నందున ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణశాఖ సూచనలు చేసింది. వడ దెబ్బకు గురైతే జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.
తలనొప్పి, తల తిరగడం, తీవ్రమైన జ్వరం, నిద్ర మత్తు, కలవరింతలు, ఫిట్స్, నాడి వేగంగా కొట్టుకోవడం, నాలుక ఎండిపోవడం, శరీరంలో నీటిశాతం కోల్పోవడం, పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితి.