హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలోని ఫార్మర్స్ ప్రొడ్యూసర్ల కంపెనీ (ఎఫ్పీసీ)ల ద్వారా రైతుల నుంచి నేరుగా భారీస్థాయిలో మిర్చిని సేకరించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) నిర్ణయించింది. మిర్చి ఎక్కువగా పండే ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, సూర్యాపేట లాంటి జిల్లాల్లో మండలానికి 3 చొప్పున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి సేకరణ జరిపేందుకు సెర్ప్ అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై వివిధ జిల్లాల్లోని మహిళా సంఘాలతో మాట్లాడి ఏర్పాట్లు పూర్తిచేశారు.
ఫిబ్రవరి నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభంకానున్నాయి. ప్రధానంగా ‘తేజ’ రకం మిర్చిని సేకరించనున్నారు. కారంపొడికి అవసరమైన మిర్చిని కూడా సేకరిస్తారు. గతేడాది 10 టన్నుల మిర్చిని సేకరించి కారంపొడి తయారు చేశారు. ప్రస్తుతం రైతులు ఖమ్మం జిల్లాలోనే దాదాపు 2 లక్షల ఎకరాల్లో మిర్చిని పండిస్తున్నారు. అక్కడ సేకరించిన మిర్చిని మహబూబాబాద్ జిల్లా కురవి సమీపంలోని కంపెనీ కొనుగోలు చేస్తుంది. మిర్చి నుంచి నూనె, పల్ప్ తయారుచేసి విదేశాలకు ఎగుమతి చేయనున్నది.
మహిళా స్వయం సహాయక సంఘాలు గ్రామాల్లోనే నేరుగా మిర్చిని కొనుగోలు చేయనుండటంతో రైతులకు వివిధ రకాలుగా మేలు జరుగుతుంది. ధర విషయంలో ఎలాంటి మోసాలకు, తరుగుకు ఆస్కారం ఉండదు. రైతులకు రవాణా ఖర్చులతోపాటు వ్యాపారులు తీసుకొనే కమీషన్ కూడా మిగులుతుంది. దీంతో రైతులు కూడా మహిళా సంఘాలకే మిర్చిని విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు.