హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వేడి, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 21 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేశారు. శుక్రవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 46.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 5-6 రోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని హెచ్చరించింది.
తూర్పు ఉత్తరప్రదేశ్ నుంచి ఒడిశా కోస్తా తీరం వరకు కొనసాగిన ద్రోణి శుక్రవారం వాయవ్య ఉత్తరప్రదేశ్ నుంచి తూర్పు ఉత్తరప్రదేశ్ మీదుగా ఒడిశా తీరప్రాంతంలో సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ ఎత్తులో మిళితమైందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొన్నది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని పలు ప్రాంతాలతోపాటు కొమురిన్, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాల్లో మరింత ముందుకు సాగే పరిస్థితులున్నట్టు అధికారులు తెలిపారు.
వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలుంటాయని అంచనా వేశారు. రాబోయే 5 నుంచి 6 రోజులు తీవ్ర వడగాడ్పులు, ఉక్కపోత వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్భూపాలపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని వెల్లడించారు.
