హైదరాబాద్ : తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రసాద్ ఐ మ్యాక్స్ థియేటర్స్ అధినేత రమేష్ ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం మసబ్ ట్యాంక్లోని కార్యాలయంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ను రమేశ్ ప్రసాద్ కలిసి ధన్యవాదాలు తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న తెలుగు చలనచిత్ర రంగాన్ని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచినందుకు సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్ యాదవ్కు కృతజ్ఞతలు తెలిపారు.
లాక్డౌన్తో షూటింగ్లు లేక సుమారు ఏడాది పాటు థియేటర్లు మూతబడి చిత్ర పరిశ్రమలోని వేలాది మంది అనేక ఇబ్బందుకు గురయ్యారని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఈ రంగంపై ఆధారపడిన వారందరిలో మనోధైర్యాన్ని నింపిందన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని అన్ని విధాలుగా చేయూత అందిస్తుందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. పరిశ్రమలోని సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.