తిరుపతి : హైదరాబాద్ సనత్ నగర్ లోని ఆర్ ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ అధినేత వెంకటేశ్ దంపతులు రూ కోటి 30 లక్షల విలువయ్యే అత్యాధునిక రూఫ్ సస్పెండెడ్ అల్ట్రా మోడరన్ డిజిటల్ ఎక్స్ రే యూనిట్ ను ఆదివారం టీటీడీ ఈవో, ఆస్పత్రి ఎండీ ధర్మారెడ్డికి అందజేశారు. ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు వేగంగా అందిస్తున్న బర్డ్ ఆసుపత్రిలో ఈ సౌకర్యం కల్పించడం పట్ల దాత వెంకటేశ్ను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా ఎక్స్రే యంత్రాన్ని ప్రారంభించారు. ఈ యంత్రం ప్రత్యేకతలను ఈవో వివరించారు.
రాయలసీమలో ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో లేని రూఫ్ సస్పెండెడ్ అల్ట్రా మోడరన్ డిజిటల్ ఎక్స్ రే వల్ల రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్స్ రే తీసే సదుపాయం లభిస్తుందని చెప్పారు. రోగిని అటు, ఇటు కదిపి నొప్పి వచ్చే ట్లు చేయకుండా టేబుల్ నే ఏ విధంగా కావాల్సి ఉంటే అలా తిప్పుకుని సులువుగా ఎక్స్ రే తీయొచ్చని పేర్కొన్నారు. ఎక్స్ రే హై క్వాలిటీ తో వస్తుందని, ఒక నిమిషంలోనే రోగికి, అతనికి వైద్యం అందిస్తున్న డాక్టర్ వాట్స్ యాప్ కు ఎక్స్ రే వెళుతుందని వెల్లడించారు. ఒక కాపీ ఆసుపత్రి రికార్డులో భద్ర మవుతుందని వివరించారు.
ఇందుకోసం క్లౌడ్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నందువల్ల రోగి ప్రపంచంలో ఏ మూల నుంచి అయినా ఎప్పుడైనా ఎక్స్ రే చూసుకోవచ్చని తెలిపారు. త్వరలో ఆధునిక సిటి మిషన్ ప్రారంభిస్తామని, మరిన్ని ఆధునిక వైద్య పరికరాలు సమకూర్చుకుని రోగులకు వేగంగా, నాణ్యమైన సేవలు అందిస్తామని ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రాచపల్లి రెడ్డెప్పరెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ కిశోర్ కుమార్, డాక్టర్ రామ్మూర్తి, డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ దీపక్, ఎఈవో శ్రీ పార్థసారథి, రేడియాలజి ఇన్చార్జి మునిరత్నం పాల్గొన్నారు.