న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: లఖింపూర్ కేసు చాలా తీవ్రమైనదే అయినప్పటికీ నిందితుడు ఆశిష్ మిశ్రా ఎక్కడికీ పారిపోయే అవకాశం లేదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కేసులో సాక్షులకు తగినంత భద్రత కల్పించామని పేర్కొన్నది. సాక్ష్యాలను ఆశిష్ మిశ్రా తారుమారు చేసే అవకాశం లేదని చెప్పింది. బెయిల్ రద్దు కోసం అప్పీలు చేయాలన్న సిట్ సూచనలను అమలు చేయకపోవడాన్ని ఈ విధంగా సమర్థించుకొన్నది. ఆశిష్ మిశ్రా బెయిల్ రద్దు పిటిషన్పై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. సిట్ సూచనలను యూపీ సర్కారు పాటిస్తుందని తాము భావించినట్టు తెలిపింది. కానీ అలా చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. ‘బెయిల్ రద్దుకు పిటిషన్ దాఖలు చేయాలని మేం బలవంతం చేయలేం. అప్పీలు చేయాలని సిట్ రెండు సార్లు లేఖ రాసినప్పటికీ మీరు స్పందించలేదు. అప్పీలు కోసం మీరు అంత ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు’ అని యూపీ సర్కారును ఉద్దేశించి వ్యాఖ్యానించింది. బెయిల్ రద్దుపై తీర్పును వాయిదా వేసింది. గతేడాది అక్టోబర్ 3న లఖింపూర్లో ఆశిష్ మిశ్రా కాన్వాయ్ రైతులపై నుంచి దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు, అనంతరం చెలరేగిన హింసలో మరో నలుగురు చనిపోయారు. ఈ కేసులో ఆశిష్కు ఫిబ్రవరి 14న అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ బెయిల్ మంజూరు చేసింది. దీనిపై రైతుల కుటుంబ సభ్యులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.