న్యూఢిల్లీ, జూన్ 10: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాదారులకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. అమలులోకి వచ్చిన ఈ నిర్ణయంతో రుణాలపై నెలవారి చెల్లింపులు మరింత అధికంకానున్నాయి. దీంతో నెల కాలపరిమితి రుణాలపై వడ్డీరేటు 15 బేసిస్ పాయింట్లు పెరగడంతో వడ్డీరేటు 8.10 శాతానికి, నెల రుణాలపై రేటు 8.20 శాతానికి చేరుకున్నది.
మూడు నెలల కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు సవరించడంతో రుణరేటు 8.40 శాతం నుంచి 8.50 శాతానికి ఎగబాకింది. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 5 బేసిస్ పాయింట్లు సవరించింది. దీంతో రేటు 8.80 శాతం నుంచి 8.85 శాతానికి చేరుకున్నది. కానీ, ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై రేటును యథాతథంగా ఉంచడం విశేషం.