హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): శరీరంలో క్యాన్సర్ వ్యాధికి కారణమవుతున్న నిరుపయోగ కణాలను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) పరిశోధకులు గుర్తించారు. వర్సిటీలోని స్కూల్ ఆఫ్ లైఫ్సైన్స్ ప్రొఫెసర్ జగన్ పొంగుబాల, ఆయన పరిశోధక విద్యార్థుల బృందం రక్తంలోని బీ అండ్ టీలోని నిరుపయోగ కణాలను కనుగొన్నది. వాటిని శరీరం నుంచి పూర్తిగా తొలిగించడానికి మైక్రో ఆర్ఎన్ఏ అనే కొత్త కణాన్ని కనిపెట్టింది. ఈ కణం నిరుపయోగ కణాలను గుర్తించి ధ్వంసం చేస్తుంది. రక్తంలో ఈ కణాలు ఎక్కువరోజులు ఉంటే క్యాన్సర్కు దారితీస్తాయని ప్రొఫెసర్ జగన్ పొంగుబాల తెలిపారు. ఈ పరిశోధనకు సంబంధించి వివరాలు అమెరికాకు చెందిన ప్రొసీడింగ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్లో ప్రచురితమయ్యాయని చెప్పారు.