హైదరాబాద్ : గణేశ్ నవరాత్రి ఉత్సవాలు, విగ్రహాల నిమజ్జనంపై రాష్ట్ర హైకోర్టు ఆంక్షలు విధించింది. పర్యావరణ పరిరక్షణ, జల, వాయు కాలుష్యాలను అరికట్టేందుకు వీలుగా పలు మార్గదర్శకాలు జారీ చేస్తూ తీర్పు ఇచ్చింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అనుసరించాల్సిన విధివిధానాలపై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, న్యాయమూర్తి జస్టిస్ టీ వినోదద్కుమార్తో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మామిడి వేణుమాధవ్ దాఖలు చేసిన వ్యాజ్యంపై వాద ప్రతివాదనలు పూర్తికావడంతో గురువారం తీర్పును వెలువరించింది.
పీఓపీతో తయారు చేసిన విగ్రహాలను హుస్సేన్సాగర్లో విగ్రహాలు నిమజ్జనం కాకుండా చర్యలు తీసుకోవాలని, ప్రత్యేకంగా రబ్బర్ డ్యామ్ తరహాలో ఏర్పాట్లు చేయాలని కోర్టు ఆదేశించింది. పీఓపీ విగ్రహాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీటి కుంటల్లోనే నిమజ్జనం జరిగేలా చూడాలని, ఈ మేరకు ఆయా విగ్రహాలను నిమజ్జనానికి ఎక్కడికి తరలించాలో పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు మండపాల నిర్వాహకులకు చెప్పాలని సూచించింది. సాగర్లో విగ్రహాలను ట్యాంక్బండ్పై నుంచి కాకుండా సచివాలయం, ఎన్టీఆర్ మార్గ్, పీవీ మార్గ్, నెక్లెస్ రోడ్, సంజీవయ్య పార్క్ రోడ్డు వైపు నుంచి అనుమతివ్వాలని చెప్పింది.
కరోనా మహమ్మారి నేపథ్యంలో దూర ప్రాంతాల నుంచి ప్రజలు ఎక్కువ రాకుండా చూడాలని, ఇండ్లలో ప్రతిష్టించిన విగ్రహాలకు.. ఇంటి వద్ద బకెట్లలో నిమజ్జనం జరిగేలా చూడాలని చెప్పింది. కరోనా మూడో దశవ్యాప్తి హెచ్చరికల నేపథ్యంలో భక్తులు భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని, నిమజ్జనం రోజున జీహెచ్ఎంసీ ఉచితంగా మాస్కులు పంపిణీ చేయాలని, సిబ్బంది శానిటైజర్లు వినియోగించాలని ఆదేశించింది. అలాగే పర్యావరణానికి ముప్పు లేని ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను ప్రతిష్టించి పూజించేలా ప్రోత్సహించాలని, పర్యావరణాన్ని దెబ్బతీసే ప్లాస్టిక్, పీవోపీ విగ్రహాలతో జరిగే నష్టాలను ప్రజలకు వివరించాలని సూచించింది.