న్యూఢిల్లీ: ప్రైవేటు ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే కోటా ఇవ్వాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దానిపై ఆ రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇవాళ సుప్రీంలో సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హర్యానా ప్రభుత్వం తరపున వాదించారు. ఫిబ్రవరి 7వ తేదీ సోమవారం రోజున ఈ కేసును టేకప్ చేయాలని సీజేఐ ఎన్వీ రమణతో కూడిన ధర్మాసనాన్ని ఆయన కోరారు. తుషార్ మెహతా అభ్యర్థనతో సుప్రీం ఈ కేసును ఏడో తేదీకి వాయిదా వేసింది. పంజాబ్-హర్యానా హైకోర్టు తమ వాదనలను వినిపించుకోలేదని, కేవలం 90 నిమిషాల్లోనే ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధించిందని తుషార్ సుప్రీంలో తెలిపారు. గత ఏడాది నవంబర్లో స్థానిక నిరుద్యోగల కోసం ఓ చట్టాన్ని పాస్ చేసింది. ఈ ఏడాది జనవరి 15వ తేదీ నుంచి ఆ చట్టం అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో 75 శాతం స్థానిక కోటాపై హైకోర్టు స్టే విధించడాన్ని హర్యానా వ్యతిరేకిస్తోంది.