రైతులను అరిగోస పెడుతున్న బీజేపీ సర్కారు అన్నదాతల కోపాగ్నిలో మాడిమసై పోవడం ఖాయం. ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు ట్రాన్స్ఫార్మర్లు, కరెంట్, విత్త్తనాల కోసం ధర్నాలు చేశాం. తెలంగాణ వచ్చాక పుష్కలంగా సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో రైతులు సంతోషంగా ఉన్నారు. ఈ సమయంలో కేంద్రం యాసంగిలో వడ్లు కొనబోమని చెప్పి రైతులకు ఆన్యాయం చేసే చర్యలకు దిగుతుంది. పంజాబ్ మాదిరిగా తెలంగాణ వడ్లను కొనుగోలు చేయాలి. కేంద్రం వడ్లు కొనబోమని చెబుతుంటే ఇక్కడ బీజేపీ నాయకులు మాత్రం వడ్లు కొనాలని ధర్నాలు చేయడం దొంగే దొంగ అని అరవడంలా ఉన్నది.
– సిద్దిపేట ధర్నాలో మంత్రి హరీశ్రావు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దొంగమాటలతో కాలం గడుపుతున్నది. యాసంగి వడ్లు కొనబోమని తెలంగాణ రైతుల గుండెల్లో బండేసింది. తెలంగాణపై బీజేపీ ప్రభుత్వానికి మొదటినుంచీ సవతితల్లి ప్రేమే. వడ్లు కొనలేమని లేఖలు రాస్తూ ఢిల్లీ బీజేపీ పరేషాన్ చేస్తుంటే, గల్లీ బీజేపీ వరి వేయాలంటూ తప్పుడు ప్రకటనలు చేస్తున్నది. బండి సంజయ్కి దమ్ముంటే యాసంగిలో వడ్లు కొంటామని కేంద్ర ప్రభుత్వంతో ఆర్డర్ ఇప్పించాలి.
-ధర్మపురి ధర్నాలో మంత్రి కొప్పుల ఈశ్వర్
పంజాబ్తోపాటు ఇతర రాష్ర్టాల్లో కేంద్ర ప్రభుత్వం వంద శాతం ధాన్యం కొనుగోలు చేస్తున్నది. తెలంగాణ రైతుల పట్ల మొదటినుంచి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారు. ప్రజలకు అవసరమున్నవి అడగకున్నా చేస్తున్నారు. దీంతో చుట్టుపక్కల రాష్ర్టాల ప్రజలు, ఎమ్మెల్యేలు తమను తెలంగాణలో కలుపాలని కోరుతున్నారు. ఇది చూసి తట్టుకోలేని బీజేపీ.. రైతులపై కుట్రలు చేస్తున్నది. సీఎం కేసీఆర్ పిడికిలి బిగిస్తే.. ఢిల్లీ గద్దె అతలాకుతలం అయితది.
-సూర్యాపేట ధర్నాలో మంత్రి జగదీశ్రెడ్డి
కేంద్రం నిర్ణయాలు కార్పొరేట్లకు అనుకూలంగా ఉంటున్నాయి. అన్నదాతలపై, వ్యవసాయంపై కేంద్రంలోని బీజేపీ సర్కారు తీవ్ర వివక్ష చూపుతున్నది. అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉంటున్న తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతున్నది. తెలంగాణ రైతులు.. రైతులు కాదా? ఇక్కడ పండేది పంట కాదా?. బాధ్యతలేని బీజేపీ నేతలు రైతులను అయోమయానికి గురిచేస్తున్నారు. రైతుల బాగోగులు చూసుకునేది సీఎం కేసీఆర్ ఒక్కరే.
-హనుమకొండ ధర్నాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
రైతులు పండించిన ప్రతి గింజను కొనాల్సింది కేంద్ర ప్రభుత్వమే. రైతు సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఓర్వలేని బీజేపీ నాయకులు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. యాసంగి వరి సాగు విషయంలో తెలంగాణ రైతులకు అండగా ఉంటాం.
– ములుగు ధర్నాలో మంత్రి సత్యవతి రాథోడ్
భారతీయ జనతా పార్టీ బట్టేబాజ్ పార్టీ. బీజేపీ నీచమైన, అమానవీయమైన రాజకీయం చేస్తున్నది. రైతులను అడ్డం పెట్టుకుని కిరికిరి చేస్తున్నది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్వయంగా వరి పంట వేయొద్దని పదే పదే చెప్పారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం వరి పంట వేయాలంటూ రైతులను మభ్య పెడుతున్నాడు. యాసంగి వడ్లు మొత్తం కేంద్రమే కొంటుందని బండి సంజయ్ లెటర్ తీసుకు రావాలి.
-వేల్పూర్ ధర్నాలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోరినా ఇవ్వలేదు. గల్లీలో ఉండే సిల్లీ ఫెలోస్ ఎన్ని విమర్శించినా ఏడేండ్లసంది ఓపిక పట్టినం. ఇప్పుడు మాత్రం రైతులు పండించిన వడ్లను కొనేదాకా విడిచి పెట్టం. ప్రపంచంలోని ఆకలి రాజ్యాల్లో పాకిస్థాన్ 92, బంగ్లాదేశ్ 76 స్థానాల్లో ఉంటే భారత్ 102వ ర్యాంకులో ఉన్నది. దేశాన్ని ఆకలి రాజ్యాల పక్కన చేర్చారంటే మీకు సిగ్గనిపించట్లేదా? మనమంతా జై కిసాన్ అంటుంటే బీజేపీ నై కిసాన్ అంటున్నది. వీళ్లకు హిందూ, ముస్లిం, బాబ్రీ తప్ప దేశ అభివృద్ధిపై పట్టింపులేదు. రైతుల జీవితాలతో చలిమంటలు కాచుకుంటున్నది. రైతు గనక తిరగబడితే వాళ్ల ఎడ్లబండ్ల కింద నలిగిపోతారు జాగ్రత్త.
-సిరిసిల్ల ధర్నాలో మంత్రి కేటీఆర్
తెలంగాణలో రైతు పోరాటం మొదలైంది. వడ్లను కొనకుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించడం ఖాయం. గులాబీ సైనికులు తలుచుకొంటే మతి భ్రమించి మాట్లాడుతున్న బీజేపీ నాయకులను తరిమికొడతారు. ఆరు నెలలుగా ఢిల్లీ వీధుల్లో రైతులు పోరాటం చేస్తున్నా బీజేపీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు. కేంద్రం ధాన్యాన్ని సేకరించేలా కేంద్రమంత్రి కిషన్రెడ్డి చొరవ తీసుకోవాలి.
-హైదరాబాద్ ధర్నాలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడితే, కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలతో వారి ఆత్మహత్యలకు కారణమవుతున్నది. వడ్లు కొనాల్సిన బాధ్యత ఎఫ్సీఐ, కేంద్రప్రభుత్వానిదే. మోసపూరిత మాటలతో పబ్బం గడుపుకోవడంపైనే బీజేపీ నేతలకు ఆసక్తి. రైతులపై ప్రేమ ఉంటే వారు పండించిన ధాన్యాన్ని సేకరించాలి.
-హైదరాబాద్ ధర్నాలో మంత్రి మహమూద్ అలీ
బీజేపీ నేతలు ఢిల్లీలో ఒకమాట, గల్లీలో మరోమాట మాట్లాడుతున్నారు. రైతాంగానికి గుదిబండగా మారిన కొత్త సాగు చట్టాలను వెంటనే వెనక్కు తీసుకోవాలి. వరి వేస్తే ఉరి వేస్తామనే రీతిలో కేంద్రం ప్రవర్తిస్తున్నది. కార్పొరేట్ సంస్థలకు దాసోహం అంటున్న మోదీ విధానాలను దేశ ప్రజలంతా ఖండిస్తున్నారు. మోదీ ప్రభుత్వానికి ఇతర రాష్ర్టాల మీద ఉన్న ప్రేమ తెలంగాణపై లేదు.
-మహేశ్వరం ధర్నాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి
రైతులను మోసం చేస్తున్న దగాకోరు ఝూటా పార్టీ బీజేపీ. తెలంగాణ రైతులను ఏడిపిస్తున్న బీజేపీ నాశనం అవుతుంది. బీజేపీ నేతలకు దమ్ముంటే యాసంగి వడ్లు సేకరించేలా కేంద్రాన్ని ఒప్పించాలి. రాష్ట్ర రైతులకు న్యాయం జరిగేవరకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో కేంద్రంపై పోరాటం చేస్తాం. బీజేపీ అబద్ధాలను రైతుల నమ్మొద్దు.
-ఘట్కేసర్ ధర్నాలో మంత్రి మల్లారెడ్డి
బెదిరింపులకు సీఎం కేసీఆర్ లొంగే వ్యక్తి కాదు. కేంద్రంపై పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. తెలంగాణ సొమ్ముతోనే కులుకుతున్న కేంద్రం.. ఎట్టి పరిస్థితుల్లోనూ యాసంగి వడ్లు కొనాల్సిందే. ఇక్కడి భూముల్లో ఏ పంటలు పండుతాయో వాటినే పండిస్తాం. పంజాబ్లో ధాన్యం కొంటూ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు? ఏ విషయంలో రాజకీయం చేసినా రైతుల విషయంలో చేయవద్దు.
-మహబూబ్నగర్ ధర్నాలో మంత్రి శ్రీనివాస్గౌడ్
వడ్లను బాధ్యతగా సేకరించాల్సిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై వివక్ష చూపుతున్నది. ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం ఒకవైపు ధాన్యం కొనుగోలు చేసేదిలేదని చెప్తుంటే, స్థానిక బీజేపీ నేతలు యాసంగిలో వరే సాగు చేయాలని రైతులను రెచ్చగొడుతున్నారు. యాసంగి వడ్లను సేకరిస్తామని రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించగలరా?
– నిర్మల్ ధర్నాలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
బీజేపీకి తెలంగాణ రైతుల ఉసురు తగులుతది. తెలంగాణ రైతులతో పెట్టుకుంటే పుట్టగతులు లేకుండాపోతారు. ధాన్యం సేకరించకుంటే ఊరుకొనేది లేదు. కేంద్రం మెడలు ఎలా వంచాలో సీఎం కేసీఆర్కు తెలుసు. సీఎం కేసీఆర్ రైతును రాజు చేస్తుంటే, భయంతో కేంద్రం ధాన్యం కొనుగోళ్లపై కొర్రీలు పెడుతున్నది. బీజేపీ ఆటలు తెలంగాణలో సాగనివ్వం.
-ఖమ్మం ధర్నాలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్